ఆర్థిక లావాదేవీలపై పోలీసుల నజర్…

by  |
ఆర్థిక లావాదేవీలపై పోలీసుల నజర్…
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: గట్టు వామన్ రావు దంపతుల హత్య తరువాత జరిగిన పరిణామాల్లో పుట్ట మధు కేంద్రీకృతంగా విచారణ మొదలైంది. రెండున్నర నెలల పాటు స్తబ్తంగా ఉండడంతో ఈ కేసు కథ ముగిసిందనుకున్న తరుణంలో వామన్ రావు తండ్రి కిషన్ రావు ఇచ్చిన మరో ఫిర్యాదు, సుపారీ మర్డర్ అన్న లేఖలు ఉన్నతాధికారులకు చేరడంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. దీంతో పది రోజుల పాటు పోలీసులకు చిక్కకుండ తప్పించుకున్న పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధూకర్‌ను శనివారం రామగుండం పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వామన్ రావు హత్యకు రెండు, మూడు రోజుల ముందు రూ. 2 కోట్లు డ్రా అయ్యాయని కూడా ప్రచారం జరిగింది.

ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా వెలుగులోకి వచ్చాయని సమాచారం. ఈ నేపథ్యంలో పుట్ట మధు విచారిస్తున్న పోలీసులకు ఆయన నుండి మౌనమే సమాధానం వస్తోందని సమాచారం. తనకు ఈ మర్డర్ తో తనకెలాంటి సంబంధం లేదని పుట్ట మధు పోలీసు అధికారులకు చెప్తున్నట్టు తెలుస్తోంది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు పుట్ట మధు సంబంధీకుల బ్యాంకు లావాదేవీలను సేకరించే పనిలో పడ్డారు. 12 బ్యాంకులకు లేఖలు రాసిన పోలీసులు అకౌంట్లలో జరిగిన లావాదేవీలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని కోరినట్టు సమాచారం.

పోలీసులు ఆయా బ్యాంకులకు రాసిన లేఖలో పుట్ట మధు, శైలజ, పుట్ట మధు కొడుకు శ్రీహర్ష (బిట్టు), కోడలు, కూతురు, పుట్ట సత్యనారాయణ, కర్నాటకలోని రాయచూర్‌లో నివాసం ఉంటున్న పుట్ట మధు స్నేహితుడు మద్దిపాటి అలియాస్ గుంటూరు శ్రీనివాస్, కుంట శ్రీను, బిట్టు శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్, పుట్ట శైలజ అకౌంట్స్ ఉన్న బ్యాంక్ లకు పోలీసులు లేఖలు రాసినట్టు తెలుస్తోంది. వామన్ రావ్ హత్యకు రెండు నెలల ముందు, రెండు నెలల తరువాత జరిగిన లావాదేవీల వివరాలు ఇవ్వాలని కోరిన పోలీసులు. రూ. 5 లక్షలకు మించిన లావాదేవీలన్నింటిని కూడ ఇవ్వాలని పోలీసులు కోరారని సమాచారం.

Next Story