యూపీ సర్కారు కీలక నిర్ణయం…వారందరికీ టీకా ఫ్రీ

by  |
vaccine wastage
X

లక్నో : కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండినవారికి టీకా వేయాలని కేంద్ర ప్రభుత్వం నిశ్చయించింది. అయితే ఇప్పటివరకు వేస్తున్న 45 ఏళ్లు పైబడినవారికి, ఫ్రంట్ లైన్ వారియ్స్ మాదిరిగా ఉచితంగా వేస్తారా..? లేక డబ్బులు తీసుకుని వేసుకోవాలా..? అనే దానిమీద ఇప్పటికీ స్పష్టమైన ప్రకటన చేయలేదు. కానీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడినవారందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందజేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ప్రకటించారు. మంగళవారం రాత్రి నిర్వహించిన మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ఈ సందర్భంగా యోగి స్పందిస్తూ… ‘ఉత్తరప్రదేశ్‌లో 18 ఏళ్లు దాటినవారికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది’ అని తెలిపారు. అంతేగాక ‘కరోనా ఓడిపోతుంది. భారతదేశం గెలుస్తుంది..’ అని ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా ముఖ్యమంత్రి ప్రకటన అనంతరం రాష్ట్ర వైద్య శాఖ ఇందుకు సంబంధించిన పనులను ప్రారంభించింది. భారత్‌లో పెద్ద రాష్ట్రాలలో ఒకటిగా ఉన్న యూపీలో సుమారు 20 కోట్ల మంది జనాభా ఉంది. జనానికి తగ్గట్టు వ్యాక్సినేషన్ కేంద్రాలను పెంచనున్నట్టు వైద్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. యూపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యోగి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వాటిని దృష్టిలో ఉంచుకుని చేసిందేనని రాజకీయ విమర్శకులు కామెంట్లు చేస్తున్నారు.

అసోంలోనూ..

ఉత్తరప్రదేశ్ మాదిరిగానే అసోంలోనూ 18 ఏళ్లు నిండినవారికి ఉచితంగా వ్యాక్సిన్ అందించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అసోం వైద్య శాఖ మంత్రి హిమాంత్ బిశ్వాస్ శర్మ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. 18-45 ఏళ్లవారికి అసోం ప్రభుత్వమే ఉచితంగా వ్యాక్సిన్లను అందజేస్తుందని ఆయన తెలిపారు. గతేడాది ఆరోగ్య నిధి ద్వారా సేకరించిన నిధులను ఇందుకోసం వినియోగిస్తామని ఆయన ప్రకటించారు. ఈ మేరకు 1 కోటి డోసుల వ్యా్క్సిన్ కోసం భారత్ బయోటెక్‌కు ఆర్డర్ ఇచ్చినట్టు ట్విట్టర్ లో పేర్కొన్నారు.



Next Story

Most Viewed