వృద్ధులకేది వ్యాక్సిన్..? హెల్ప్​ఏజ్​ ఇండియా సర్వేలో సంచలనాలు

by  |
Senior Citizens Vaccine
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా వైరస్​కు జాగ్రత్తలే ప్రధానం. అంతకు మించిన అస్త్రం వ్యాక్సిన్. తొలి దశలో 45 ఏండ్లకు పైబడిన వారందరికీ అవకాశం. వృద్ధులకు ప్రాధాన్యం.. ఇదీ ప్రభుత్వం, అధికారులు, వైద్యులు చెబుతోన్నది. ప్రచారం కూడా అదే తీరున సాగుతోంది. కానీ వ్యాక్సిన్​వేయించుకోవడం ఆ పెద్దలకు కష్టంగా మారింది. అన్నీ ఉన్నా కుటుంబ సభ్యులు వదిలించుకున్న పెద్దతరానికి ఆ వ్యాక్సిన్​అందుకోవడం కష్టంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యికి పైగా వృద్ధాశ్రమాలు ఉన్నాయి. వారికి వ్యాక్సిన్​ఎక్కడ వేయించుకోవాలి? ఎక్కడ వేయించుకోవాలి? ఎలా బుక్​చేసుకోవాలి? ఎలా వెళ్లాలి? ఎవరు సాయం చేస్తారు? ఈ ప్రశ్నల పరంపర ప్రతి ఆశ్రమంలోనూ కురుస్తోంది.

ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా హెల్ప్​ఏజ్​ఇండియా వృద్ధులకు కరోనా వ్యాక్సిన్​పై సర్వే నిర్వహించింది. సర్వేలో వారి మనోవేధన అంతా ఇంతా కాదు. ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన దీనగాధ. కరోనా నుంచి ఎలా రక్షించుకోవాలో తెలియక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ దశలో కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోవడంతో మనోవ్యథకు గురవుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్, హెచ్ఎండీఏ పరిధిలో వందలాదిగా వృద్ధాశ్రమాలు ఉన్నాయి. వీటిలో కొన్ని మాత్రం ఉచిత సర్వీసులు అందిస్తున్నాయి. చాలా వరకు డబ్బులు తీసుకొని సేవలందించేవి ఉన్నాయి. వాటిలోనూ కుటుంబ సభ్యుల నిర్లక్ష్యానికి గురైన వారే అధికం. వాళ్లు సరిగ్గా చూసుకునే వారైతే చక్కగా మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకుంటూ కాలక్షేపం చేసేవారు. ఇప్పుడా పెద్దతరానికి వ్యాక్సిన్​వేయించేందుకు ప్రభుత్వం సరైన విధానం అనుసరించకపోతే అన్యాయమై పోతారని హెల్ప్​ఏజ్​ఇండియా సర్వే ద్వారా స్పష్టమవుతోంది.

వారందరికీ వ్యాక్సిన్​ ఎలా?

కరోనా వ్యాక్సిన్​వేయించుకోవాలని పెద్దతరం అనుకుంటున్నది. కానీ రోడ్లపైకి వచ్చే పరిస్థితులు లేవు. ఎక్కడ, ఎవరితో మాట్లాడినా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా వ్యాక్సిన్​కేంద్రాలకు వెళ్లడం కష్టం. వెళ్లినా అక్కడ క్యూ లైన్లలో నిలబడడం వల్ల లేని వైరస్​ను తాకించుకోవడమేనన్న అభిప్రాయం నెలకొంది. అలాగే వృద్ధాశ్రమం నుంచి కేంద్రానికి వెళ్లేందుకు రవాణా సదుపాయం కూడా కష్టంగా మారింది. ఈ దశలో ఎవరితో కలిసి ప్రయాణించే అవకాశం లేదు. రోజూ సోషల్​మీడియా, ప్రసార మాధ్యమాల్లో కరోనా గురించి వార్తలు వారికి దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఒక్కో ఇంట్లో ఒకరికి మించి చనిపోతున్న ఉదంతాలు చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇలాంటి పరిస్థితులు తమకు వస్తే సేవలందించే మానవ వనరులు, మానవమూర్తులను వెతుక్కోవడం కష్టమని భయాందోళనకు గురవుతున్నారు.

పైగా వ్యాక్సిన్​కోసం రిజిస్ట్రేషన్​ప్రక్రియ కూడా వారికి కష్టం. ఈ దశలో ప్రభుత్వం సమీప ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారానే వృద్ధాశ్రమాల్లోని పెద్దతరాన్ని కరోనా వైరస్ నుంచి కాపాడుకోవచ్చునని హెల్ప్​ఏజ్​ఇండియా చేపట్టిన సర్వే ద్వారా వెల్లడైంది. తమ సంస్థ కాల్​సెంటర్​కు ఫోన్లు చేసి వ్యాక్సిన్​గురించే ఎక్కువగా అడుగుతున్నట్లు సంస్థ కో ఆర్డినేటర్​శ్యాంకుమార్​‘దిశ’కు వివరించారు.

శాఖల మధ్య సమన్వయ లోపం

వృద్ధాశ్రమాల్లోని పెద్దల్లో చాలా మందికి ఆధార్​కార్డులు లేవు. అవి ఉన్నా వారి దగ్గర లేవు. కనిపెంచితే వదిలేసిన కుటుంబ సభ్యుల దగ్గరే ఉండిపోయాయి. ఇప్పుడేమో కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నా, రిజిస్ట్రేషన్​చేయించుకోవాలన్నా ఆ గుర్తింపు కార్డు అనివార్యమంటున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ షరతుల ప్రకారం విధిగా ఆధార్​కార్డు ఉండాల్సిందే. ఐతే ఆశ్రమాల్లో కొందరు రోడ్డున పడితే అక్కున చేర్చుకున్నారు. కొడుకులు, బిడ్డలు ఆస్తులను లాగేసుకొని వదిలేస్తే మానవమూర్తులు ఆశ్రమాల్లో చేర్చారు. అలాంటి వారి దగ్గర ఏ గుర్తింపు కార్డులు లేవు. నిజానికి వాళ్ల ఐడెంటినీ మర్చిపోయారు. కాటికి కాలు చాపుకున్న వారి దగ్గర ఏ కార్డులు లేవు. అలాంటి వారికి వ్యాక్సిన్​వేయాలంటే ఆధార్​కార్డు కావాలంటే ఆశ్రమ నిర్వాహకులు ఎక్కడ నుంచి తీసుకురావాలన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వృద్ధుల సంక్షేమ శాఖ మాత్రం అలాంటి అవసరమేదీ లేదంటున్నది. వైద్య, ఆరోగ్య శాఖ మాత్రం ఆధార్​కార్డు ఉంటేనే నమోదు చేసుకున్న తర్వాతే వ్యాక్సిన్​అంటున్నది. రెండు శాఖల మధ్య సమన్వయలోపం వృద్ధులకు వ్యాక్సిన్​అందకుండాపోయే ప్రమాదం తలెత్తినట్లు తెలుస్తోంది. కొన్ని జిల్లాల్లో మాత్రం వికలాంగుల శాఖ​అధికారులు చొరవ తీసుకోవడం ద్వారా ఎలాంటి గుర్తింపు కార్డులు లేకపోయినా వ్యాక్సిన్​వేస్తున్నారు. చాలా జిల్లాల్లో మాత్రం పేచీ పెడుతున్నారు.

హెల్ప్​ ఏజ్​ ఇండియా సర్వేలో ఇలా..

+ సీనియర్​సిటిజన్ల వ్యాక్సిన్​కేంద్రాల దగ్గర ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలి. 90 శాతం పెద్దల అభిప్రాయం. అక్కడ లైనులో నిలబడితే లేని వైరస్ సోకుతుందన్న భయాన్ని వ్యక్తం చేశారు.
+ ప్రతి కాలనీ, ఊరిలోనూ తొలుత వృద్ధులకు వ్యాక్సిన్​వేయాలి. మొబైల్​వ్యాక్సినేషన్​కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
+ వ్యాక్సిన్​వేయించుకోవడం వల్ల సైడ్​ఎఫెక్టులు ఉంటాయన్న ప్రచారం ఉంది. అపోహలు ఉన్నాయి.
+ వ్యాక్సిన్​కేంద్రాలకు తమను ఎవరు తీసుకెళ్తారు? రవాణా సదుపాయం కష్టంగా ఉంది.
+ సోషల్​మీడియా, వాట్సాప్ ల్లో కరోనాపై ప్రచారం తీవ్రంగా ఉంది. వాటిని చదువుతుంటే భయంగా ఉంది.
+ రిజిస్ట్రేషన్ ​చేసుకోవడం రాదు. ఆధార్ కార్డులు లేకపోతే ఎలా నమోదు చేయించుకోవాలి?

ఉచిత రవాణ చేస్తున్నాం..

ఎవరైనా వృద్ధులకు వ్యాక్సినేషన్​కేంద్రాలకు వెళ్లేందుకు రవాణా సదుపాయం లేకపోతే హెల్ప్​ఏజ్​ఇండియా సాయం అందిస్తోంది. 1800 180 1253 ఎల్డర్స్ హెల్ప్​లైన్​కు కాల్​చేసి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో చెబితే హెల్ప్​ఏజ్​ఇండియా ప్రతినిధులు ఉబెర్​క్యాబ్​సర్వీసును ఉచితంగా అందించనున్నారు. ఇంటి నుంచి కేంద్రానికి, కేంద్రం నుంచి మళ్లీ ఇంటికి చేర్చే వరకు రవాణా సదుపాయాన్ని కల్పిస్తోంది. ఇప్పటికే 2 వేల మందికి ఈ మేరకు ఉచిత రవాణా సర్వీసులను అందించినట్లు సంస్థ ప్రతినిధి శ్యాంకుమార్​తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తమ సంస్థ దేశ వ్యాప్తంగా ఈ ఉచిత రవాణా సేవలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు.


Next Story

Most Viewed