టీకా కేంద్రాల్లోనే రిజిస్ట్రేషన్.. వారికి మాత్రమే అవకాశం

by  |
vaccination centers
X

న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 18 నుంచి 44ఏళ్ల వయసున్న వారికీ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కోసం నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ అవకాశం కేవలం ప్రభుత్వ నిర్వహణలోని టీకా కేంద్రాల్లోనే అందుబాటులో ఉండనుంది. ప్రైవేటు కేంద్రాల్లో టీకా కోసం తప్పనిసరిగా కొవిన్‌లో ఆన్‌లైన్‌లో ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకుని టీకా కోసం అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాల్సిందే. అయితే, ప్రైవేటు కేంద్రాలు తప్పకుండా ఏ రోజుకారోజూ టీకా పంపిణీ వివరాలు ప్రచురించాల్సి ఉంటుంది.

ఈ ఆన్‌సైట్ రిజిస్ట్రేషన్‌పై తుది నిర్ణయం రాష్ట్రాలదేనని స్పష్టం చేసింది. కేవలం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా స్మార్ట్ ఫోన్, లేదా డిజిటల్ అక్షరాస్యత లేనివారికి టీకా పొందడం పెద్ద సవాల్‌గా మారిందని, దీనికితోడు టీకా వృథానూ అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేవలం ఆన్‌లైన్ ద్వారానే షాట్స్ బుక్ చేస్తున్న టీకా కేంద్రాల గురించి కేంద్ర ప్రస్తావించింది. ఒక్కోసారి కొందరు టీకాను ఫలానా రోజు వేసుకుంటామని బుక్ చేసుకున్నప్పటికీ కొన్ని కారణాలతో తీరా ఆ రోజు వాళ్లు రాలేకపోవడంతో కొన్ని టీకాలు మిగులుతున్నాయని పేర్కొంది. ఇలాంటి వృథాను అరికట్టాలంటే టీకా కేంద్రాల్లోని పరిస్థితులను బట్టి ఆన్‌సైట్ రిజిస్ట్రేషన్‌కు అనుమతినిచ్చే నిర్ణయం తీసుకున్నామని వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను జిల్లా అధికారులు తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకోవాలి.

Next Story

Most Viewed