తొలి దశలో 51 లక్షల మందికి టీకా: ఢిల్లీ సీఎం

by  |
తొలి దశలో 51 లక్షల మందికి టీకా: ఢిల్లీ సీఎం
X

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో తొలి దశలో భాగంగా 51 లక్షల మందికి కరోనా వైరస్ టీకా వేయనున్నారు. టీకా వేసుకునేవారిని గుర్తించే ప్రక్రియ, టీకా పంపిణీ, నిల్వకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది తొలినాళ్లలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే సూచనలున్నాయి. తొలి దశలో హెల్త్‌కేర్ స్టాఫ్, కరోనా యోధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, 50ఏళ్లుపైబడినవారికి టీకా వేయనున్నారు.

వ్యాక్సినేషన్ గురించి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, తొలిగా టీకా వేయించుకునే 51 లక్షల మందిని ప్రభుత్వం గుర్తించిందని, వీరికోసం 1.2 కోట్ల డోసులు అవసరమవుతాయని వివరించారు. ఇప్పటి వరకు మూడు లక్షల మంది వైద్యసిబ్బందిని, ఆరు లక్షల కరోనా యోధులను, డయాబెటిస్, హృద్రోగ, ఇతర వ్యాధులున్నవారు, 50ఏళ్లుపైబడినవారు 42 లక్షల మందిని గుర్తించామని తెలిపారు. టీకా వేసుకోవాల్సినవారి గుర్తింపు ప్రక్రియ దాదాపు పూర్తయిందని, మరోవారంలో ధ్రువీకరణ ప్రక్రియ ముగుస్తుందని చెప్పారు. ప్రస్తుతం 74లక్షల టీకా డోసులను నిల్వ చేసే సామర్థ్యాన్ని సిద్ధంగా చేశామని, వారం రోజుల్లో 1.15 కోట్ల డోసులను నిల్వ చేసే సామర్థ్యాన్ని సంపాదిస్తామని పేర్కొన్నారు.

టీకా వేయించుకునేవారిని ఎస్ఎంఎస్‌ల ద్వారా కాంటాక్ట్ అవుతామని, టీకా వేసుకోవాల్సిన సమయం, వేదిక, ఇతర వివరాలను అందిస్తామని వివరించారు. టీకాతో ఏదైనా సమస్య తలెత్తిన ఎదుర్కోవడానికి తగిన ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు. టీకా అనుమతి కోసమే తాము ఎదురుచూస్తున్నామని అన్నారు.


Next Story