కరీంనగర్‌ను రెండో రాజధాని చేస్తరేమో : వీహెచ్

by  |
కరీంనగర్‌ను రెండో రాజధాని చేస్తరేమో : వీహెచ్
X

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో కూడా రెండు రాజధానులు చేసే ప్రయత్నాలు సీఎం కేసీఆర్ చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. సీఎం కేసీఆర్‌పై వీహెచ్ వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఆంధ్రా సీఎం జగన్ ఏపీలో మూడు రాజధానులు చేస్తుండగా, తెలంగాణలో కేసీఆర్ రెండు రాజధానుల ఏర్పాటుకు ఆలోచన చేస్తాడనిపిస్తోందని సెటైర్లు వేశారు.

ఏపీలో మూడు రాజధానుల బిల్లుకు ఆ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో స్పందించిన ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఆంధ్రా సీఎం జగన్మోహన్‌రెడ్డి చేసిన మూడు రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదించారని, జగన్ దారిలోనే కేసీఆర్ కూడా నడుస్తారనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఆయన మూడు రాజధానులు చేయగా తాను రెండు రాజధానులు ఎందుకు చేయొద్దని సీఎం కేసీఆర్ ఆలోచిస్తారని.. సీఎం తీరును ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు కలిసొచ్చే విధంగా కరీంనగర్‌ను రెండో రాజధానిగా చేస్తారేమోనని, కొత్తదనం కోరుకునే సీఎం కేసీఆర్‌కు ఖచ్చితంగా రెండో రాజధాని ఆలోచన వస్తుందనిపిస్తోందని వీహెచ్ ఆరోపించారు.

Next Story