అతిపెద్ద సంక్షోభం వలస కార్మికులదే..

by  |
అతిపెద్ద సంక్షోభం వలస కార్మికులదే..
X

– ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి

దిశ, న్యూస్‌బ్యూరో: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా లాక్‌డౌన్ ప్రకటించడం.. దినసరి కూలీలు, అసంఘటిత రంగాలపై తీవ్ర ప్రభావం చూపిందని ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి సంజీవరెడ్డి ఆరోపించారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం గాంధీ భవన్‌లో టీపీసీసీ కొవిడ్-19 టాస్క్‌ఫోర్స్ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో వలస కార్మికులు, అసంఘటితరంగ కార్మికుల సమస్యలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్.సీ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సంజీవరెడ్డి.. ఔరంగాబాద్ సమీపంలో రైలు ప్రమాద ఘటనలో చనిపోయిన వలస కార్మికులకు సంతాపం వ్యక్తం చేశారు. కార్మికుల ప్రస్తుత దుస్థితిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో వలస కార్మికులదే అతిపెద్ద సంక్షోభమన్నారు. మద్యం దుకాణాలను తెరవడం వల్ల వినియోగదారులు భౌతిక దూరాన్ని పాటించడం లేదన్నారు. ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాలతో వైన్ షాపులు తెరవడం.. లాక్‌డౌన్ ఉద్దేశ్యాన్ని దెబ్బతీసిందని సంజీవరెడ్డి మండిపడ్డారు.

Next Story