సీఎం కేసీఆర్‌పై ఉత్తమ్‌, రేవంత్ ఫైర్

by  |
సీఎం కేసీఆర్‌పై ఉత్తమ్‌, రేవంత్ ఫైర్
X

దిశ, న్యూస్‌బ్యూరో: ఆరేళ్లుగా సీఎం కేసీఆర్, మంత్రులకు అబద్దాలాడటం అలవాటుగా మారిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ నేతలు ప్రతి విషయంలో బూటకపు మాటలు చెబుతూ వస్తున్నారన్నారు. ఆదివారం నల్గొండలో తాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేశారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఎన్నో హామీలిచ్చి మరిచారని, ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వం ఏర్పాటైన గంటలోపే రూ. 11వేల కోట్ల రుణమాఫీ ఏకకాలంలో జరిగిందన్నారు. పసుపు రైతుల విషయంలోనూ కేసీఆర్ మాట తప్పారని, నల్గొండ జిల్లా బత్తాయి రైతుల సమస్యలకు ఆయనే కారణమన్నారు. రాష్ట్రంలో నీటిపారుదల రంగం అభివృద్ధి జరిగినట్లుగా తప్పుడుప్రచారం చేస్తున్నారని, ఉమ్మడి రాష్ట్రంలోనే 75లక్షల ఎకరాల ఇరిగేషన్ ఆయకట్టు ఉందన్నారు.

ఎర్రవల్లికి సర్పంచ్‌లా ఉంటున్నారు: రేవంత్

కేసీఆర్ రాష్ట్రానికి సీఎంలా కాకుండా ఎర్రవల్లికి సర్పంచ్‌గా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. నీళ్లు-నిధులు-నియామకాలు ఎజెండాతో ఉద్యమంలో పాల్గొన్నది టీఆర్ఎస్ పార్టీ అయితే, ఉద్యమాన్ని ఉవ్వెత్తిన ఎగిరించిన వ్యక్తులు జయశంకర్, కోదండరాం, విద్యార్థులు, కళాకారులన్నారు. ఉద్యమం ఉధృతంగా సాగిందంటే ఆర్టీసీ, సింగరేణి కార్మికులే అన్నారు. ఏసీ సీఎం జగన్ నీళ్లు తీసుకుపోతున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చి ఆరేళ్ళు గడుస్తున్నా అమరుల కుటుంబాలను ప్రభుత్వం గుర్తించలేదన్నారు. ఉద్యమకారులపై కేసులు తొలగించకుండా, కేసీఆర్ ఫ్యామిలీపై ఉన్న కేసులను ప్రత్యేక టీమ్‌లతో కొట్టి వేయించుకున్నారన్నారు. ప్రాజెక్టులపై నిధులు ఖర్చు చేస్తే పాలమూరు, ఎస్ఎల్‌బీసీ లాంటి ప్రాజెక్టులు ఎటు పోయాయని ప్రశ్నించారు.

Next Story

Most Viewed