సీఎం, డీజీపీ నాటకం ఆడుతున్నారు: ఉత్తమ్

by  |
సీఎం, డీజీపీ నాటకం ఆడుతున్నారు: ఉత్తమ్
X

దిశ, న్యూస్‌బ్యూరో: కేసీఆర్ ప్రభుత్వ తీరుపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతోందని విమర్శించారు. గోదావరి ప్రాజెక్టుల సందర్శనకు యత్నించిన కాంగ్రెస్ నేతలను అర్థరాత్రి అరెస్ట్ చేయడం, పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. శనివారం ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడుతూ నిబంధనలకు లోబడే పెండింగ్ ప్రాజెక్టుల సందర్శనకు పిలుపు నిచ్చినా ప్రభుత్వం అడ్డుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే
ప్రజాస్వామ్య వ్యవస్థ మెరుగుపడుతుందనుకున్నాం కానీ మాట్లాడే హక్కు కూడా లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమంలో చేపట్టినా అడ్డుకుంటున్నారని ఆక్షేపించారు. సీఎం, మంత్రులకు కొవిడ్ ఆంక్షలు ఉండవని, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ప్రారంభానికి వందల మంది మాస్క్‌లు లేకుండా వచ్చారని ఆరోపించారు. నల్గొండ జిల్లాలో మంత్రి జగదీశ్‌రెడ్డి రోజూ వందల మందితో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, కానీ తను సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లినా పోలీసులు అడ్డుకున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్, డీజీపీ, హైదరాబాద్ కమిషనర్‌లు నాటకం ఆడుతున్నరా అని ఉత్తమ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల పట్ల పోలీస్‌లు వ్యవరిస్తున్న తీరుపై గవర్నర్‌ను కలుస్తామన్నారు.

తెలంగాణ ద్రోహి సీఎం కేసీఆర్: భట్టి

ప్రాజెక్టుల పేరిట తెలంగాణను దోచుకుంటున్న ద్రోహి, దుర్మార్గుడు సీఎం కేసీఆర్ అని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ దుర్మార్గాలను బయట పెడుతున్నామనే కాంగ్రెస్ నేతలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. మౌనం చాలా ప్రమాదకరమని, ప్రజలు మౌనం వీడి ప్రశ్నించాలని సూచించారు. ప్రతి రూపాయి ప్రజలదేనన్న విషయం మర్చిపోవద్దని తెలిపారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కేసీఆర్ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ నేతల అరెస్ట్

గోదావరి ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, ఎంపీ రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీని శనివారం ఉదయం నుంచే గృహ నిర్బంధంలో పెట్టారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లేందుకు యత్నించిన భట్టి విక్రమార్కను వైరాలో, ఎమ్మెల్యే పొదెం వీరయ్యను భద్రాచలంలో అడ్డుకుని తిరిగి పంపించి గృహ నిర్బంధం చేశారు. కొత్తగూడెంలో వీహెచ్, కూన శ్రీశైలం గౌడ్‌ను లక్ష్మీదేవిపోలీస్ స్టేషన్‌లో ఉంచారు. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబును గృహ నిర్బంధంలో ఉంచారు. జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. మేడిపల్లి సత్యం, జగిత్యాల కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్, బండ శంకర్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. దేవాదుల ప్రాజెక్టుకు వెళ్లకుండా ములుగు ఎమ్మెల్యే సీతక్కను ఇంటి నుంచి బయటకు రాకుండా కట్టడి చేశారు. జానారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లను పోలీసులు హౌజ్ అరెస్ట్‌ చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవేల్లి -గండిపల్లి ప్రాజెక్ట్ దగ్గర నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన సంపత్ కుమార్, నియోజకవర్గ ఇంచార్జి బొమ్మ శ్రీరామ్‌లతో పాటు సుమారు 150మంది కాంగ్రెస్ కార్యకర్తలు అరెస్ట్ చేశారు.



Next Story

Most Viewed