క్వారంటైన్‌లోకి వెళ్లిన అమెరికా ఉపాధ్యక్షుడు

by  |
క్వారంటైన్‌లోకి వెళ్లిన అమెరికా ఉపాధ్యక్షుడు
X

వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఇటీవల తన వ్యక్తిగత సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. సదరు వ్యక్తికి కరోనాగా తేలిన రోజు నుంచే అందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మైక్ పెన్స్ సైతం రోజు కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు. ఆయనకు ప్రతీసారి నెగెటివ్ ఫలితమే వచ్చినా.. వైద్యుల సూచన మేరకు ఆయన స్వీయ నిర్బంధంలోనికి వెళ్లారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత, లోపలికి వచ్చే వ్యక్తులకు టెస్టులు నిర్వహిస్తున్నా.. కరోనా వైరస్ వైట్‌హౌస్ లోనికి ప్రవేశించడంపై ఆందోళన నెలకొంది. కరోనాపై అధ్యక్షుడు ట్రంప్ ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ బృందానికే కరోనా సోకడం గమనార్హం. దీంతో ఆ బృందంలోని ఉన్నత స్థాయి అధికారులు, శాస్త్రవేత్తలు స్వీయ నిర్బంధంలోనికి వెళ్లగా.. తాజాగా ఉపాధ్యక్షుడు కూడా క్వారంటైన్ కాక తప్పలేదు. వైట్ హౌస్ వైద్య బృందం వీరందరికీ క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇవాంక పీఏకు, మైక్ పెన్స్ మీడియా కార్యదర్శికి కూడా కోవిడ్-19 సోకింది.

Next Story

Most Viewed