టీకా తీసుకో.. మిలియన్ డాలర్ల విలువైన గిఫ్ట్ గెల్చుకో!

by  |
vaccination
X

దిశ, ఫీచర్స్: మనదేశంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన మొదట్లో టీకా వేసుకోమంటే చాలామంది వెనకడుగేశారు. తీరా పరిస్థితుల చేజారిపోతున్న వేళలో టీకాను మించిన మార్గం మరొకటి కనిపించకపోయే సరికి ప్రజలంతా వ్యాక్సినేషన్ సెంటర్లకు పరుగులు తీశారు. కాని యునైటెడ్ స్టేట్స్‌ ‘వ్యాక్సినేషన్ డ్రైవ్‌’లో దేశ పౌరులు పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయడానికి అక్కడి ప్రభుత్వాలు ఉత్సాహపూరితమైన పథకాలు ప్రకటిస్తూ వారిని ఆకర్షిస్తున్నాయి. ఓహియో రాష్ట్ర గవర్నర్ టీకాలు వేసుకునే తమ రాష్ట్ర ప్రజలకు మిలియన్ డాలర్ల లాటరీ ప్రైజ్ అనౌన్స్ చేశాడు.

ప్రస్తుతం మన దేశంలో టీకాల కొరతతో బాధపడుతున్నాం. ప్రజలు టీకా తీసుకోవడానికి ముందుకొస్తున్న తరుణంలో మన దేశంలో సరిపడా టీకాలు లేవు. అయితే అమెరికా మాత్రం ఇప్పటికే తమ దేశ పౌరుల్లో 80 శాతానికి పైగా జనాభాకు వ్యాక్సిన్ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయడం విశేషం. ఈ క్రమంలోనే తమ రాష్ట్ర ప్రజలు వ్యాక్సినేషన్ వేయించుకుంటే వారిలో ఐదుగురు విజేతలు మిలియన్ డాలర్ల విలువైన బహుమతిని పొందే అవకాశముందని ఓహియో రాష్ట్ర గవర్నర్ మైక్ డివైన్ ప్రకటించారు. ప్రతి బుధవారం ఈ లక్కీ డ్రా జరుగుతుందని.. ఐదు వారాల పాటు ఇది కొనసాగుతుందని డివైన్ చెప్పారు. అంతేకాదు మే 26 వరకు టీకా ఫస్ట్ డోస్ పొందిన పెద్దలకు ప్రత్యేక డ్రా ఉంటుందని తెలిపాడు.

రాష్ట్ర రిజిస్టర్డ్ ఓటర్ల జాబితా నుంచి వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న వారి పేర్లు తీసుకుంటారు. ఒకవేళ డేటాబేస్‌లో లేకపోతే, లాటరీ కోసం సైన్ అప్ చేయడానికి వారికో లింక్ అందిస్తున్నారు. ఈ పథకానికి డబ్బును ఒహియో ఆరోగ్యశాఖ అందిస్తుంది. గవర్నర్ ట్వీట్‌కు ప్రజల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ‘ప్రజల్లో అవగాహన కల్పించడానికి మార్కెటింగ్ పేరుతో చేసే ఖర్చుతో పోల్చితే ఐదు మిలియన్ డాలర్లు చాలా తక్కువ. అందుకే ఇదొక గొప్ప ఆలోచన’ అని నెటిజన్ ట్వీట్ చేశాడు. ‘ట్యాక్స్ పేయర్స్ డబ్బును వృథా చేయకుండా పనికివచ్చే పని చేస్తే బాగుంటుంది’ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

‘కొంతమంది ప్రజలు ఇది పిచ్చిపనిగా భావించి.. మిలియన్ డాలర్ల లాటరీ ఆలోచన వల్ల ప్రజాధనం వృథా అవుతుందని అనుకోవచ్చు. కానీ టీకాలు చాలా సులభంగా లభించినప్పుడు కూడా వేసుకోకపోతే ఈ మహమ్మారికి బలైపోవడమే అతిపెద్ద లాస్’ – మైక్ డివైన్, ఓహియో గవర్నర్

Next Story