ఆఫ్ఘాన్ పరిస్థితులపై స్పందించిన అమెరికా.. తాలిబన్లకు స్ట్రాంగ్ వార్నింగ్

by  |
President Joe Biden
X

దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాలు వెనుదిరిగిన నాటినుంచి తాలిబన్ ఉగ్రవాదులు అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. దాదాపు ఇప్పటికే దేశం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో తాలిబన్ల పాలనను భరించలేక ఆఫ్ఘాన్ ప్రజలు ప్రపంచ దేశాలకు వలస పోతున్నారు. దీంతో అమెరికా తీసుకున్న నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా.. అఫ్గానిస్థాన్‌లో తలెత్తిన సంక్షోభంపై అమెరికా స్పందించింది. వైట్‌హౌజ్‌లో సోమవారం బైడెన్‌ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆఫ్గాన్‌ నుంచి సైనిక బలగాల ఉపసంహరణ నిర్ణయం సరైందేనని స్పష్టం చేశారు. ఈ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటున్నట్లు స్పష్టం చేశారు. ఆఫ్గాన్‌ నుంచి సైనికులను రప్పించడానికి సరైన సమయం అంటూ లేదని, 20 ఏళ్ల తర్వాత ఈ విషయాన్ని గ్రహించానని జో బైడెన్‌ వెల్లడించారు. అయితే, అనుకున్నదానికంటే వేగంగా తాలిబన్లు ఆఫ్గాన్‌ ప్రభుత్వాన్ని పడగొట్టారని తెలిపారు. ఆఫ్గాన్ వివాదంపై వ్యుహాత్మకంగా వ్యవహరించక తప్పలేదన్నారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది అమెరికా దళాలను ఆఫ్గాన్‌ నుంచి వెనక్కి రప్పించడం జరిగిందన్నారు. లేదంటే ప్రపంచ వ్యాప్తంగా యుద్ద మేఘాలు కమ్ముకునేవన్నారు.

అమెరికా ప్రజలపై తాలిబన్లు దాడి చేస్తే తీవ్ర పరిస్థితులు ఉంటాయని బైడెన్‌ హెచ్చరించారు. ఆఫ్గాన్‌ నుంచి అమెరికా దళాలు నిష్క్రమించినప్పటికీ ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగుతాయన్నారు. అమెరికా దళాలకు సహాయం చేసిన స్థానిక ఆఫ్గాన్‌ ప్రజలను త్వరలోనే అమెరికాకు తరలిస్తామని, వారిపై తాలిబన్లు దాడి చేస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామన్నారు. అంతేగాకుండా.. ఆఫ్గాన్‌ ప్రభుత్వాన్ని, సైనిక బలగాలను బైడెన్‌ విమర్శించారు. ఆఫ్గాన్‌ సైనికులకు అన్ని రకాల వనరులు కల్పించి శిక్షణ ఇచ్చినప్పటికీ వారు తాలిబన్లతో పోరాడలేకపోయారన్నారు. ఆఫ్గాన్‌ పౌర ప్రభుత్వం నిలదొక్కుకోవడానికి అన్ని అవకాశాలు ఇచ్చామని, అయితే వారికి సంకల్పం బలం మాత్రం ఇవ్వలేకపోయామని బైడెన్‌ అన్నారు. ఆఫ్గాన్‌ ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు బిలియన్‌ డాలర్లను అందించామని ఈ విషయంలో చైనా, రష్యా ఏం చేయలేకపోయాయని దుయ్యబట్టారు. అమెరికా దళాలు, సిబ్బందిపై తాలిబన్లు దాడులు చేస్తే తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని మరోసారి హెచ్చరించారు.

Next Story

Most Viewed