యూనికార్న్ హోదాకు చేరువలో ఎడ్‌టెక్ స్టార్టప్ 'అప్‌గ్రాడ్'!

by  |
యూనికార్న్ హోదాకు చేరువలో ఎడ్‌టెక్ స్టార్టప్ అప్‌గ్రాడ్!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎడ్‌టెక్ స్టార్టప్ సంస్థ ‘అప్‌గ్రాడ్’ త్వరలో 400 మిలియన్ డాలర్లు(సుమారు రూ. 2,970 కోట్లు) నిధులను సమీకరించాలని భావిస్తోంది. ఈ నిధుల ద్వారా కంపెనీ యూనికార్న్ సంస్థల జాబితాలోకి చేరే అవకాశం లభిస్తుంది. దీనికోసం ప్రైవేట్ ఈక్విటీతో పాటు వెంచర్ కేపిటల్ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ నిధుల సమీకరణ అనంతరం ‘అప్‌గ్రాడ్’ మార్కెట్ విలువ పది రేట్లు పెరిగి 4 బిలియన్ డాలర్ల(రూ. 30 వేల కోట్ల)కు చేరుకోనుంది. 2015లో ప్రారంభమైన ‘అప్‌గ్రాడ్’కంపెనీ ముంబై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుత ఏడాదిలో ఈ కంపెనీ రెండు దశల్లో 160 మిలియన్ డాలర్ల(రూ. 1,200 కోట్ల)ను సేకరించింది. దీని ద్వారా కంపెనీ విలువ 850 మిలియన్ డాలర్ల(రూ. 6,315 కోట్ల)కు చేరింది. దీనిపై స్పందించిన కంపెనీ చైర్మన్ రోనీ స్క్రూవాలా.. రానున్న రెండు మూడు నెలల్లో ఈ రంగంలోని చిన్న కంపెనీలను కొనే ప్రయత్నాల్లో ఉన్నట్టు చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలో ‘అప్‌గ్రాడ్’ సంస్థ ప్రముఖ వీడియో ఎనేబుల్‌డ్ లెర్నింగ్ పరిష్కారాల సంస్థ ఇంపార్టస్‌ను రూ. 150 కోట్లకు కొనుగోలు చేసింది. తాము ఉన్న రంగంలో యూనికార్న్ జాబితాకు మించిన లక్ష్యాన్ని కలిగి ఉన్నామని రోనీ వెల్లడించారు.

Next Story

Most Viewed