కొద్ది రోజుల్లోనే దేశ పౌరులందరికి టీకా

by  |
కొద్ది రోజుల్లోనే దేశ పౌరులందరికి టీకా
X

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రెండో సారి జరుగుతున్న డ్రై రన్ ప్రక్రియను సమీక్షిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల వ్యవధిలోనే దేశ పౌరులందరికీ టీకా అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. ‘స్వల్ప సమయంలోనే కరోనావైరస్‌ నిలువరించే టీకాను భారత్ విజయవంతంగా చేపట్టింది. ప్రస్తుతం రెండు టీకాలు అత్యవసర వినియోగ అనుమతులు పొందాయి. మరికొద్ది రోజుల్లో పౌరులందరికీ టీకా వేస్తాం. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో రిస్కు గ్రూపులను గుర్తిస్తూ వ్యాక్సినేషన్ చేపడతాం. ఇలా దేశ పౌరులందరికీ టీకా వేస్తాం’ అని అన్నారు.

టీకా పంపిణీ ప్రక్రియ కోసం ప్రధాని ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి అంటే నాలుగైదు నెలల నుంచే వ్యాక్సినేషన్ కోసం కసరత్తు చేస్తూనే ఉన్నామని వివరించారు. టీకాలను ట్రాక్ చేయడానికి కొత్తగా కొవిన్ అప్లికేషన్‌ను వినియోగిస్తున్నామని చెప్పారు. దీనితో టీకా లబ్దిదారుల వివరాలను గుర్తించడం దగ్గర నుంచి వారికి టీకా అందించడం, తదుపరి టీకా వివరాలు తెలుపడం, టీకా వేసే వేదిక, తేదీ ఇతర సమాచారం తెలియజేయడం సాధ్యమవుతున్నదని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న టీకాల వివరాలను కచ్చితంగా తెలుపుతుందని చెప్పారు.

17 నుంచి దేశవ్యాప్తంగా పోలియో ఇమ్యునైజేషన్..
ఈ నెల 17 నుంచి మూడు రోజుల పాటు పోలియో ఇమ్యునైజేషన్ డ్రైవ్ చేపడతామని వివరించారు. పౌరుల రోగ నిరోధక శక్తి సామర్థ్యాలను పెంచడానికి ఈ వ్యాక్సినేషన్ ఉపకరిస్తుందని అన్నారు. ముఖ్యంగా పోలియోను నిలువరించే సామర్థ్యాన్ని సగటు పౌరుడు సమకూర్చుకోగలుగుతారని తెలిపారు.



Next Story

Most Viewed