‘ఆర్టీసీని నాశనం చేసింది అశ్వత్థామరెడ్డే’

by  |
‘ఆర్టీసీని నాశనం చేసింది అశ్వత్థామరెడ్డే’
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఆర్టీసీని నాశనం చేసిన ఘనత టీఎంయూ మాజీ నేత అశ్వత్థామరెడ్డిదేనని, ఆయన బయట ఉంటే చేసిన అవినీతికి జైల్లో పెడతారని భయపడి.. మళ్లీ యూనియన్‌లో చేరతానని అంటున్నారని టీఎంయూ వ్యవస్థాపక అధ్యక్షుడు థామస్​రెడ్డి అన్నారు. అందుకే ఆయన్ను టీఎంయూ నుంచి తొలగిస్తున్నట్టు థామస్‌ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం టీఎంయూ కార్యాలయంలో యూనియన్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా థామస్​రెడ్డి మాట్లాడుతూ.. ఏడాదిన్నర నుంచి అశ్వత్థామరెడ్డి ఆర్టీసీ సంఘాలను నిర్వీర్యం చేశారని, దీంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఇప్పటికే కార్మికులు ఉద్యోగాల్లో చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, టీఎంయూలో అశ్వత్థామరెడ్డిని ముందుగా నామినేట్ చేసింది తానేనన్నారు. టీఎంయూ నుంచి తనను తొలగిస్తున్నట్టు మాట్లాడుతున్నాడని, మజ్దూర్​ యూనియన్​ నుంచి ఆయన్నే తొలగిస్తున్నామని, రాష్ట్రంలో ఆర్టీసీని సర్వనాశనం చేసింది అశ్వత్థామరెడ్డి అని ఘాటుగా విమర్శించారు.

అంతేకాకుండా థామస్ రెడ్డిని మళ్ళీ బస్ భవన్‌లోకి ట్రాన్స్‌ఫర్‌ చేయండి.. జిల్లా నుంచి రప్పించండి అని సీఎం కేసీఆర్ ఆదేశించారని, థామస్​రెడ్డితోనే కార్మికులు కష్టాలు తీరుతాయని సీఎం కేసీఆర్​ వెల్లడించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆర్టీసీ కష్టాల్లో ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకం ఉందని, ఆర్టీసీని ప్రభుత్వం ఆదుకోవాలని, లాక్‌డౌన్​లో కూడా డ్యూటీ లేకున్నా, బస్సులు నడవకున్న జీతాలు ఇచ్చారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో న్యాయం చేస్తారనే ఆశతో ఉన్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ధీటుగా ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయని ఆశిస్తున్నామని, ఇప్పటికే చాలా బస్సులు పాడైపోయాయని, 2000 కొత్త బస్సులు కొనాలని కోరుతున్నామని, కార్మికులు ఆందోళనలో ఉన్నారని, వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని థామస్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు.



Next Story

Most Viewed