ఉన్నత విద్యామండలిని ముట్టడించిన నిరుద్యోగ, ఓయూ, కేయూ జేఏసీ

by  |
JAC
X

దిశ, తెలంగాణ బ్యూరో : విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్య ఉద్యోగాలు భర్తీలో ఏకీకృత పరీక్ష విధానం ఆలోచన విరమించుకోవాలని నిరుద్యోగ, ఓయూ, కేయూ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. అన్ని విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష పెట్టే విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని బుధవారం నిరుద్యోగ జేఏసీ, ఓయూ, కేయూ జేఏసీ ఆధ్వర్యంలో ముట్టడించారు.

ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ పీహెచ్‌డీకి ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తే విశ్వవిద్యాలయాల స్వయంప్రతిపత్తి దెబ్బతింటుందన్నారు. సహాయ ఆచార్య ఉద్యోగాలకి ఏకీకృత పరీక్షతో తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొలువులు వస్తాయని తెలంగాణ కోసం కొట్లాడిన నిరుద్యోగ యువతకు చిప్పచేతికిచ్చినట్లే అన్నారు. పొరుగు రాష్ట్రాల వారికి సహాయ ఆచార్య ఉద్యోగాలు కట్టబెట్టడానికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

విశ్వవిద్యాలయాలకు పరీక్షలు నిర్వహించుకున, ఉద్యోగాలు భర్తీ చేసుకునే పటిష్ఠమైన యంత్రాంగం ఉన్నా ఉమ్మడి ప్రవేశ పరీక్షలు, ఏకీకృత ఉద్యోగ పరీక్షలు ఎందుకన్నారు. విశ్వవిద్యాలయాల్లో చైతన్యాన్ని చంపేందుకు కేసీఆర్ చేసే కుట్రలను తిప్పి‌కొడతామని, రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.

పోలీసులకు, జేఏసీ నేతలకు మధ్య వాగ్వాదం

ఉన్నత విద్యామండలి కార్యాలయం ముట్టడికి జేఏసీ నేతలు తరలిచ్చారు. వారు మండలిలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించే అవకాశాలు ఉన్నాయని భారీగా పోలీసులను మోహరించడంతో పాటు పోలీసు వలయం ఏర్పాటు చేశారు. అయినా లోనికి వెళ్లేందుకు యత్నించేందుకు చేసిన సందర్భంలో పోలీసులకు, జేఏసీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. జేఏసీ నేతలు, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరి మానవతారాయ్, కేయూ జేఏసీ చైర్మన్ ఇట్టబోయిన తిరుపతి యాదవ్, కేయూ జేఏసీ కన్వీనర్‌ మేడ రంజిత్ కుమార్, కేయూ జేఏసీ అధ్యక్షుడు వినోద్ లోక్ నాయక్, ఓయూ జేఏసీ చైర్మన్ కొప్పుల ప్రతాపరెడ్డి లను అరెస్టు చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్ స్టేడియానికి తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై వదిలిపెట్టారు.

Next Story