ప్రకటనలు సరే.. రెండేళ్ల కింద వచ్చిన ఆ కంపెనీ సంగతేంటి?

by  |
Minister KTR
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో చేనేతల అభివృద్ధి కోసం 2017లో వరంగల్ సమీపంలో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను ఏర్పాటు చేసేందుకు శంకుస్థాపన పనులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు పదుల సంఖ్యలో కంపెనీలు క్యూ కట్టాయి. ఈ క్రమంలో శనివారం కిటెక్స్ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, రంగారెడ్డిలోని సీతారాంపూర్‌లో కిటెక్స్ గ్రూప్ సంస్థ రూ.2400 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. దీని ద్వారా దాదాపు 22వేల మందికి ప్రత్యక్షంగా, 18 వేల మంది పరోక్షంగా ఉద్యోగాలు పొందుతారని ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అయితే, దీనిపై పలువురు హర్షం వ్యక్తం చేస్తుండగా.. పలువురు నిరుద్యోగులు విమర్శలు చేస్తున్నారు.

ప్రతీ సారి ప్రకటనలకే పరిమితం అవుతూ ప్రజలను మోసం చేస్తున్నారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ఓ నెటిజన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆయన చేసిన ట్వీట్ ప్రకారం ‘‘ What about this MOU dated 11th Dec 2019 @jayesh_ranjan sir ?, is this MOU still under process or this Cancelled by Youngone? Mentioned 8 Units 12000 Jobs 900 Crore investment’’ అని ఉంది. ఇది వరకూ 2019 డిసెంబర్ 11వ రోజు కూడా ROK TEXTLIES కంపెనీ రూ. 900 కోట్లతో 8 యూనిట్లను వరంగల్ కాకతీయ టెక్స్‌టైల్ పార్క్‌లో ఏర్పాటుచేసేందుకు సిద్ధంగా ఉందని, దీని ద్వారా 12వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. దాదాపు రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకూ దాని ఊసే లేదు. దీని ఏర్పాటు ప్రక్రియ జరుగుతుందా? లేక రద్దు అయ్యిందా? చెప్పాలి అంటూ జయేష్ రంజన్‌కు సదరు నెటిజన్ ట్వీట్ చేశారు. నెటిజన్ చేసిన ట్వీట్‌కి చాలా మంది స్పందిస్తూ.. పెట్టుబడులకు సంబంధించి ప్రకటనలు చేసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారంటూ ట్వీట్లు చేస్తున్నారు.

Next Story