ఉద్యోగాలపై మోడీని ప్రశ్నించిన కేటీఆర్.. మంత్రిని ఆడుకుంటున్న నెటిజన్లు

by  |
Minister KTR
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ చివరికి ప్రాణాలు కోల్పోతున్నా సీఎం కేసీఆర్‌ కనికరించడం లేదంటూ నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఇంకా ఎంతమంది ఆత్మబలిదానాలు చేసుకుంటే మీలో చలనం వస్తుందంటూ నెట్టింట ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా, కేటీఆర్ చేసిన ఓ ట్వీట్ నిరుద్యోగులను ఆగ్రహానికి గురి చేసింది.

ప్రధాని మోడీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారంటూ మంత్రి కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. అందులో గుజరాత్‌లో 600 పోస్టులకు వేలాదిగా తరలివచ్చిన యువకులను పోలీసులు అడ్డుకుంటున్న వీడియోను పోస్ట్ చేస్తూ మిలియన్ మార్చ్ గుజరాత్‌లో ఎందుకు చేయకూడదు అంటూ బండి సంజయ్‌కు ట్యాగ్ చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు కేటీఆర్‌పై కామెంట్స్‌తో విరుచుకుపడుతున్నారు. తెలంగాణలో గత మూడేళ్లుగా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయకుండా కాలం గడుపుతున్నారు. ముందు ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వండి అంటూ మండిపడుతున్నారు.

కేటీఆర్ సార్.. త్వరలో 50వేల ఉద్యోగాలంటూ దుబ్బాక ఎలక్షన్స్ నుంచి చెబుతున్నారు. ఇంకా ఎంత మంది నిరుద్యోగులు చనిపోతే మీకు కనికరం వస్తుంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ వేడుకుంటున్నారు. కేటీఆర్‌కు వత్తాసు పలుకుతూ టీఆర్ఎస్ సోషల్ మీడియా సైనికులు కామెంట్లు చేస్తున్నా, నిరుద్యోగుల ఆవేశానికి కేటీఆర్‌కు నిరసన తప్పడం లేదు.



Next Story