రంజీల్లో లిమిటెడ్ డీఆర్ఎస్‌కు సై..

by  |
రంజీల్లో లిమిటెడ్ డీఆర్ఎస్‌కు సై..
X

దిశ, స్పోర్ట్స్ : రంజీల చరిత్రలో సౌరాష్ట్ర జట్టు తొలిసారిగా 2019-20 రంజీ ట్రోఫీని గెలుచుకుని రికార్డు సృష్టించింది. కరోనా కారణంగా లాక్‌డౌన్ ప్రకటించడానికి కొద్ది రోజుల ముందుగా రాజ్‌కోట్‌లో జరిగిన ఈ రంజీ ఫైనల్ మ్యాచ్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే.. రంజీల్లో తొలిసారిగా లిమిటెడ్ డీఆర్ఎస్‌ను ఉపయోగించారు. క్రికెట్‌లో థర్డ్ అంపైర్ రివ్యూ అనేది 1992లో అందుబాటులోకి వచ్చింది. ఇక పూర్తి స్థాయి డెషిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్) టెస్టుల్లో 2008లో, వన్డేల్లో 2011లో, టీ20ల్లో 2017 నుంచి అమల్లోకి తెచ్చారు. కాగా, దేశవాళీ క్రికెట్ అయిన రంజీల్లో మాత్రం ఈ సీజన్ ఫైనల్స్‌లోనే లిమిటెడ్ డీఆర్ఎస్ ప్రవేశపెట్టారు. ఈ ఫైనల్ మ్యాచ్‌కు అంపైరింగ్ నిర్వహించిన ఎస్. రవి, కేఎన్ అనంతపద్మనాభన్, యశ్వంత్ బర్దే భవిష్యత్‌లో లిమిటెడ్ డీఆర్ఎస్‌కు సై అంటున్నారు.

అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఉపయోగించే హాక్ ఐ, అల్ట్రా ఎడ్జ్ టెక్నాలజీలను లిమిటెడ్ డీఆర్ఎస్‌లో ఉపయోగించరు. అయితే, లిమిటెడ్ డీఆర్ఎస్ గురించి మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్లతో పాటు అంపైరింగ్ చేసిన ఈ ముగ్గురి అభిప్రాయాలను బీసీసీఐ తీసుకోగా.. లిమిటెడ్ డీఆర్ఎస్ చాలా ఉపయోగపడినట్లు అంపైర్లు చెప్పారు. కానీ, ఆటగాళ్లు మాత్రం కాస్త అసంతృప్తితో ఉన్నారు. అయితే పూర్తి స్థాయి డీఆర్ఎస్‌ను బీసీసీఐ ఎందుకు ఉపయోగించట్లేదనే అనుమానాలు అందరికీ ఉన్నాయి. ఎందుకంటే డీఆర్ఎస్ చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ టెక్నాలజీని ఉపయోగించాలంటే ప్రతీ మ్యాచ్‌కు రూ.45 లక్షలు ఖర్చు చేయాలి. అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆదాయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్రాడ్‌కాస్టర్, బీసీసీఐ డీఆర్ఎస్ ఉపయోగిస్తోంది. కానీ దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌ల నుంచి ఆదాయం వచ్చే అవకాశం లేదు. దీంతో రూ.45 లక్షల రూపాయలు ఖర్చు చేయడానికి బీసీసీఐ సుముఖంగా లేదు.

అదే హాక్-ఐ, అల్ట్రాఎడ్డ్ టెక్నాలజీ లేకుండా డీఆర్ఎస్ వాడటం చాలా చౌక. అందుకే లిమిటెడ్ డీఆర్ఎస్‌కు సై అంటోంది. వచ్చే సీజన్‌లో సెమీస్, ఫైనల్స్‌లో కూడా లిమిటెడ్ డీఆర్ఎస్ ఉపయోగించాలని బీసీసీఐ నిర్ణయించింది. భవిష్యత్‌లో ఈ టెక్నాలజీ చౌకగా లభిస్తే అప్పుడు పూర్తి స్థాయిలో వినియోగించే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ అధికారులు చెబుతున్నారు.

Tags : DRS, Limited DRS,Cricket, BCCI, Ranji Trophy

Next Story

Most Viewed