బీజేపీ మంత్రి హత్యకు కుట్ర.. ఉల్ఫా లీడర్ అరెస్ట్

by  |
బీజేపీ మంత్రి హత్యకు కుట్ర.. ఉల్ఫా లీడర్ అరెస్ట్
X

గువహతి : అసోంలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటుండగా రాష్ట్ర ఆర్థిక మంత్రి, బీజేపీ కీలక నేత హిమంత బిశ్వ శర్మ హత్యకు కుట్ర జరిగిన వార్త వెలుగులోకి వచ్చింది. ఒకవైపు ఎన్నికల సన్నాహాలు ఫుల్ స్వింగ్‌లో సాగుతుండగా కుట్ర విషయం బయటకు రావడం కలకలం రేపుతున్నది. అసోం వేర్పాటువాద సంస్థ ఉల్ఫా ఈ కుట్రకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. శాంతి చర్చలకు సుముఖంగా ఉన్నా ఉల్ఫా లీడర్ ప్రదీప్ గొగోయ్, ఇతరులు కలిసి అసోం మినిస్టర్ హిమంత బిశ్వ శర్మను హతమార్చడానికి కుట్ర చేసినట్టు కొన్ని ఆధారలు లభించాయని వివరించారు. దిస్‌పూర్ పోలీసులు గొగోయ్‌ను ఆయన నివాసంలోనే అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. గువహతి సిటీ పోలీసు క్రైం బ్రాంచ్ గొగోయ్‌ను అదుపులోకి తీసుకుందని, త్వరలోనే కోర్టు ముందు హాజరపరచనున్నట్టు వివరించారు. ఈశాన్య రాష్ట్రాల్లో హిమంత బిశ్వ శర్మ కీలక నేతగా వెలుగొందుతున్నారు. బీజేపీ ఈశాన్య రాష్ట్రాల్లో కదంమోపి దూసుకుపోవడానికి శర్మ కీలక వ్యక్తి అని రాజకీయ నిపుణులు చెబుతుంటారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు శర్మను హతమార్చాలన్న కుట్ర వివరాలు క్యాంపెయిన్ సరళిపై ప్రభావం వేసే అవకాశముందని వివరిస్తున్నారు.

కుట్ర కేసుకు సంబంధించి గొగోయ్‌తోపాటు కర్బీ అంగ్లాంగ్ జిల్లా నుంచి మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రదీప్ గొగోయ్ అలియాస్ సిమీరన్ గొగోయ్ ఉల్ఫా సంస్థకు ఉపాధ్యక్షుడు. ఈ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరు. 1998లో అరెస్టయిన గొగోయ్ 2010లో జైలు నుంచి విడుదలయ్యారు. అప్పటి నుంచి ప్రభుత్వంతో శాంతి చర్చలకు సహకరిస్తున్నారు.


Next Story

Most Viewed