యూకేలో జంక్‌ఫుడ్ ప్రకటనలు నిషేధం

by  |
యూకేలో జంక్‌ఫుడ్ ప్రకటనలు నిషేధం
X

దిశ, ఫీచర్స్ : ‘చెత్త’ను కూడా ఆహా, సూపర్బ్, వావ్ డెలీషియస్ అంటూ తినేస్తాం. ఏంటీ చెత్తను తినేడమేంటని ఆలోచిస్తున్నారా. అదేనండి ‘జంక్‌ఫుడ్’. రుచిపరంగా ఎంత బాగున్నా.. పోషకాల పరంగా ఉపయోగం లేని ‘ఫాస్ట్‌ఫుడ్’‌కు అందరూ అలవాటుపడిపోయారన్నది కాదనలేని వాస్తవం. ఈ ఫుడ్ వల్ల వచ్చే నష్టాల గురించి వైద్య నిపుణులు సూచిస్తున్న విషయం తెలిసిందే. జంక్‌ఫుడ్ అనర్థాలను గుర్తించిన అగ్రరాజ్యాలు ఇప్పుడిప్పుడే మేలుకొంటుండగా, పిల్లలను ఇలాంటి అప్రాచ్యపు ఆహారానికి దూరంగా ఉంచడానికి చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే బ్రిటన్ ప్రభుత్వం వీటి విషయంలో ఓ అద్భుతమైన నిర్ణయం తీసుకుంది.

ఇటీవలి కాలంలో పిజ్జాలు, బర్గర్లు, హాట్‌డాగ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్, ఐస్‌క్రీములు, కార్బొనేటెడ్ కూల్‌డ్రింక్స్ వంటి జంక్‌ఫుడ్ తినడం పెద్ద జబ్బుగా మారిపోయింది. లాక్‌డౌన్ కాలంలో వీటిమీద జనాలు మరింత మోజు పెంచుకున్నారు. ఒకప్పుడు మహా నగరాలకే పరిమితమైన ఈ జంక్ ఫుడ్ పల్లెల్లోకి వచ్చేసింది. ఒంటికి హాని చేసే ఉప్పు, చక్కెర, కొవ్వులు వంటి పదార్థాలు ఎక్కువగా ఉన్న వీటిని తిన్న చిన్నారులు వయసుకు మించిన సైజుకు పెరుగుతుంటే, పెద్దలేమో రోగాలను కొనితెచ్చుకుంటున్నారు. ఊబకాయానికి, పలు అనారోగ్యాలకు జంక్ ఫుడ్ తినడమే కారణమని చాలా మంది నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా చాలా మంది చిరు తిండిగా జంక్ ఫుడ్‌నే తీసుకుంటారు.

అయితే జంక్‌ఫుడ్ తయారీ సంస్థలు ప్రధానంగా పిల్లలను టార్గెట్ చేస్తూ యాడ్స్ రూపొందిస్తుంటాయి. ‘క్యాచ్ దెమ్ యంగ్’ అనేదే జంక్ ఫుడ్ తయారీ సంస్థల వ్యాపార సూత్రం. అందుకే వాటిని చూసిన పిల్లలు తినడానికి ఆసక్తి చూపిస్తారు. వాటికి ఒక్కసారి అలవాటు పడితే ఇక అంతే.. మళ్లీ మళ్లీ అవే కావాలని వాళ్లు పట్టుపడుతుంటారు. దాంతో జంక్ ఫుడ్స్‌కు సంబంధించిన ప్రకటనలు చిన్నారుల కంట పడకుండా చర్యలు తీసుకునేందుకు బ్రిటన్ గవర్న్‌మెంట్ ఓ ముందడుగు వేసింది. ఈ మేరకు స్వీట్, సాల్ట్, ఫ్యాట్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలకు సంబంధించిన ప్రకటనలను రాత్రి 9 గంటల ముందు ప్రసారం చేయకూడదంటూ కొత్త పాలసీ విధానాన్ని ప్రకటించింది. వచ్చే ఏడాది చివరి నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. యూకేలోని పెరుగుతున్న ఊబకాయ సంక్షోభాన్ని పరిష్కరించడానికే ఈ చర్యను తీసుకుంటోంది.

అక్కడ తాజాగా నిర్వహించిన సర్వే ప్రకారం.. ముగ్గురి(హైస్కూల్ చిన్నారులు)లో ఒకరు అధిక బరువు లేదా ఊబకాయం కలిగి ఉన్నారని పరిశోధనలో తేలింది. ఇంగ్లాండ్‌లోని పెద్దలలో మూడింట రెండొంతుల మంది ఉన్నారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఈ పాలసీని ప్రకటించింది. అయితే పాడ్‌కా‌స్ట్‌, రేడియో వంటి ఆడియో మీడియా ద్వారా జంక్‌ఫుడ్ ప్రకటనలు ఇప్పటికీ అనుమతి ఉండగా, బిల్ బోర్డులు, పోస్టర్ సైట్లు, బస్సులు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు వంటి ప్రదేశాల్లోనూ వీటికి ఈ పరిమితులు వర్తించవు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌, టీవీలో ఏటా అన్ని ఆహార ప్రకటనలపై బ్రాండ్లు 600 మిలియన్లకు పైగా ఖర్చు చేస్తుంటాయి. ఈ నిబంధనలతో వాటిపై ప్రభావం పడనుంది. ఉత్పత్తుల జాబితా, నిషేధానికి సంబంధించిన విషయాలు రెండు మూడు సంవత్సరాలకు ఓ సారి సమీక్షించనున్నారు.

Next Story

Most Viewed