నీరవ్ మోదీకి లండన్ హైకోర్టులో చుక్కెదురు

by  |
నీరవ్ మోదీకి లండన్ హైకోర్టులో చుక్కెదురు
X

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) కుంభకోణం కేసులు ప్రధాన నిందితుడిగా ఉన్న నీరవ్ మోదీకి లండన్ కోర్టు షాక్ ఇచ్చింది. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించాలని వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్స్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేసుకున్న లిఖితపూర్వక అభ్యర్థనను లండన్ హైకోర్టు తిరస్కరించింది. అయితే, భారత్‌కు రాకుండా తప్పించుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు సాగిస్తున్న నీరవ్ మోదీకి ఇంకో అవకాశం ఉంది. చట్టపరమైన మార్గదర్శకాల ప్రకారం.. మరో ఐదురోజుల్లో మౌఖికంగా అభ్యర్థన చేసుకునే అవకాశం ఉందని, కోర్టు దానికి అంగీకరిస్తే విచారణ చేపడుతుందని, దానిక్కూడా తిరస్కారమే ఎదురైతే నీరవ్ మోదీ భారత్‌కు రాక తప్పదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం.. నీరవ్ మోదీ ఉన్న ఆ చివరి అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాలని చూస్తున్నట్టు సమాచారం. మౌఖికంగా అప్పీల్ చేస్తే గనక దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని భారత అధికారుల తరఫున వాదనలు వినిపిస్తున్న క్రౌన్‌ ప్రాసిక్యూషన్‌ సర్వీస్‌ తెలిపింది. పీఎన్‌బీని రూ. 13,500 కోట్ల మేర మోసం చేసిన నీరవ్ మోదీ విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి భారత్‌కు తిరిగిరాకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడు. తాజాగా అన్ని ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఇప్పుడు ఉన్న చివరి అవకాశం తిరస్కరించబడితే నీరవ్ మోదీ భారత్‌కు రాక తప్పదు.


Next Story