8 రోజుల్లో లాక్‌డౌన్.. సీఎం అల్టిమేటం

by  |
8 రోజుల్లో లాక్‌డౌన్.. సీఎం అల్టిమేటం
X

ముంబయి: దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో వ్యాప్తిని అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే అమరావతి, అచల్‌పుర్ నగరాల్లో పూర్తి లాక్‌డౌన్ విధించగా, అమరావతి, అకోలా, బుల్దానా, వాషిం, యవత్మాల్‌ జిల్లాలో పాక్షిక లాక్‌డౌన్‌లు విధించింది. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రజలు కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా మరో ఎనిమిది రోజుల్లో లాక్‌డౌన్ విధిస్తామని సీఎం ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరించారు. సోమవారం సాయంత్రం అవసరమున్న చోట లాక్‌డౌన్ అమల్లోకి వస్తుందని తెలిపారు. గతేడాది పీక్ సమయంలో కంటే నేడు అమరావతిలో అత్యధిక కేసులు నమోదయ్యాయని వివరించారు.

‘కరోనా మహమ్మారి విజృంభణ గతేడాది మార్చిలో మొదలైంది. దానికి అప్పుడూ మందులేదు. ఇప్పుడూ లేదు. మనకు అందుబాటులో ఉన్నదల్లా టీకా మాత్రమే. నిర్దేశిత లబ్దిదారులు సందేహాలన్నీ వీడి టీకా వేసుకోవాలి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 9 లక్షల మంది టీకా పొందారు’ అని వివరించారు. ‘కరోనా మహమ్మారి తొలినాళ్లలో ప్రజలందరూ జాగ్రత్తలు పాటించారని, నేడు కరోనా మొత్తంగా పోయినట్టు నిబంధనలపట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. మాస్కులూ ధరించడం లేదు. ఇప్పుడు కరోనాపై పోరులో మాస్కే మనకున్న ఆయుధం. ఒకవేళ కరోనా నిబంధనలు పాటించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది రోజుల్లో లాక్‌డౌన్ విధించాల్సి వస్తుంది. మరో 8 నుంచి 10 రోజుల్లో రాష్ట్రంలో సెకండ్ వేవ్ ఉన్నదా? లేదా? అనేది తేటతెల్లమవుతుంది. అందుకే ఈ క్లిష్ట సమయంలో అందరూ జాగ్రత్తలు పాటించాలి. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలందరూ ఇందుకు సహకరించాలి. సోమవారం నుంచి పెద్ద సభలు, రాజకీయ, మతపరమైన వేడుకలు, నిరసనలకు అనుమతి లేదు’ అని వివరించారు.



Next Story

Most Viewed