ఫిక్కీ నూతన అధ్యక్షుడిగా ఉదయ్ శంకర్!

by  |
ఫిక్కీ నూతన అధ్యక్షుడిగా ఉదయ్ శంకర్!
X

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరానికి పరిశ్రమల సమాఖ్య, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) అధ్యక్షుడిగా ఉదయ్ శంకర్‌ను ఎన్నుకున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. వాల్ట్ డిస్నీ కంపెనీ ఫర్ ఆసియా పసిఫిక్ అధ్యక్షుడు, స్టార్ అండ్ డిస్నీ ఇండియా ఛైర్మన్‌గా ఉన్న ఉదయ్ శంకర్.. ప్రస్తుతం ఫిక్కీ అధ్యక్ష స్థానంలో ఉన్న అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ ఎండీ సంగీత రెడ్డి తర్వాత ఈ బాధ్యతలను నిర్వహించనున్నారు.

ఈ నెల 11 నుంచి 14 వరకు జరుగుతున్న ఫిక్కీ 93వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉదయ్ శంకర్ నియామకంతో తొలిసారిగా మీడియాకు చెందిన వ్యక్తి ఫిక్కీకి నాయకత్వం వహించనున్నారని ఛాంబర్ శుక్రవారం వెల్లడించింది. వాల్ట్ డిస్నీ కంపెనీ, స్టార్ అండ్ డిస్నీ ఇండియా ఛైర్మన్‌గా ఈ నెల 31న ఉదయ్ శంకర్ పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం ఫిక్కీ బాధ్యతలను స్వీకరించనున్నారు.

గతంలో ఉదయ్ ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ ఫౌండేషన్(ఐబీఎఫ్) అధ్యక్షుడిగా, ఫిక్కీ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కమిటీ ఛైర్మన్‌గా పనిచేశారు. అలాగే, దేశంలో మొదటి 24 గంటల న్యూస్ ఛానల్ స్టార్ న్యూస్ సీఈవో, ఎడిటర్‌గా ఉన్నారు. టీవీ టుదే గ్రూప్‌లో ఎడిటర్, న్యూస్ డైరెక్టర్‌గా పనిచేశారు. అంతేకాకుండా 2000లో ఆజ్‌తక్, 2003లో హెడ్‌లైన్స్ టుడే ప్రారంభించడంలో కీలక పాత్ర వహించారు. కాగా,జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి ఉదయ్ శంకర్ ఎంఫిల్ పట్టా పొందారు.

Next Story