పెళ్లైన నెల రోజులకే విషాదం.. నిమజ్జనం వేడుకలకు వెళ్లి వస్తుండగా

by  |
పెళ్లైన నెల రోజులకే విషాదం.. నిమజ్జనం వేడుకలకు వెళ్లి వస్తుండగా
X

దిశ, కామారెడ్డి : గణేష్ నిమజ్జనం కోసం ఇద్దరు యువకులు స్వగ్రామాలకు వచ్చారు. నిమజ్జనం పూర్తవడంతో ఇద్దరు కలిసి విధులకు హాజరు కావడానికి ఒకే బైకుపై కలిసి వెళ్లారు. ట్రాక్టర్ రూపంలో రోడ్డు ప్రమాదం ఇద్దరిని కబళించింది. ఈ ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం రామాంతపూర్ శివారులో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండ గ్రామానికి చెందిన బందెల రవీందర్, బిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన రాజేందర్‌లు కామారెడ్డి నుంచి హైదరాబాద్‌కు బైకుపై వెళ్తున్నారు. చేగుంట మండలం రామంతపూర్ శివారులోని యూటర్న్ వద్ద వెనక నుంచి వస్తున్న ట్రాక్టర్ బైకును ఓవర్ టేక్ చేయబోతుండగా ట్రాక్టర్ బైకుకు తగిలి బైకుపై వెళ్తున్న ఇద్దరు కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతుల వివరాలు సేకరించారు.

ఇద్దరు కూడా కామారెడ్డి జిల్లాకు చెందిన వారిగా గుర్తించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ పై కేసు నమోదు చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు. అయితే మృతులిద్దరు స్నేహితులు. ఇద్దరు హైదరాబాద్‌లో పని చేస్తున్నారు. ఓ ప్రైవేట్ బ్యాంకులో రవీందర్ హౌసింగ్ కార్పోరేషన్ లోన్స్ సెక్షన్‌లో పని చేస్తుండగా రాజేందర్ ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. రవీందర్‌కు బీబీపేటకు చెందిన అమ్మాయితో నెల రోజుల క్రితం వివాహం జరిగింది. రాజేందర్‌కు పది నెలల క్రితమే వివాహం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇరు కుటుంబాల్లో ఇద్దరు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.



Next Story

Most Viewed