ప్రాణం తీసిన సెల్ఫీ సరదా.. డిండిలో జారిపడి ఇద్దరు మృతి

by  |
Two young mans dead
X

దిశ, డిండి: సెల్ఫీ సరదా ఇద్దరు యువకుల ప్రాణం తీసింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా ప్రాజెక్టు వద్ద ఆదివారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ పోచయ్య వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ నగరానికి చెందిన బుదరం ప్రవీణ్(23), మహమ్మద్ సాగర్(21), అనిల్ కుమార్(25), విశాల్(20), బాలరాజ్(22), వంశీ(19) ఆరుగురు స్నేహితులు కలిసి శ్రీశైలం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆదివారం డిండి ప్రాజెక్టు వద్ద సరదాగా గడపాలని ఆగి సెల్ఫీలు దిగుతున్నారు. ఈ క్రమంలో ఆకస్మాత్తుగా మహమ్మద్‌ సాగర్ నీటిలోకి జారి పడ్డాడు. దీంతో సాగర్‌ను రక్షించడానికి బుదరం ప్రవీణ్ నీటిలోకి దూకాడు. భయంతో ప్రవీణ్‌ను సాగర్ బిగ్గరగా పట్టుకోవడంతో ఇద్దరూ మునిగిపోయారు. వీరిని గమనించిన మిగతా మిత్రులు స్థానికుల సహాయంతో చేపలు పట్టే వలతో ఇద్దరినీ బయటికి తీసి స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్ రఘురాం నాయక్ తెలిపారు. ఆరుగురిలో ఒకరైన అనిల్ కుమా‌ర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ పోచయ్య పేర్కొన్నారు.



Next Story