అతివేగానికి మద్యం మత్తు తోడై.. ఘోర రోడ్డు ప్రమాదం

by  |
అతివేగానికి మద్యం మత్తు తోడై.. ఘోర రోడ్డు ప్రమాదం
X

దిశ, నల్లగొండ : అతివేగానికి మద్యం మత్తు తోడై.. ప్రమాదవశాత్తు కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా కేంద్రం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వలభరావు చెరువు సమీపంలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కట్టంగూరు మండలం పిట్టంపల్లి గ్రామానికి చెందిన గుండెమల్ల శ్రీకాంత్, నల్లగొండ పట్టణంలోని చర్లపల్లికి చెందిన జెర్రిపోతుల వెంకటేశ్వర గౌడ్ ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. ఇద్దరు కూడా పట్టణంలోని చంద్రగిరివిలాస్‌లో నివాసం ఉంటున్నారు. శ్రీకాంత్ ఐస్ క్రీం తయారు చేసే కంపెనీ నిర్వహిస్తుండగా, వెంకటేశ్వర్ గౌడ్ రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇద్దరు స్నేహితులు కలిసి పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న వైన్స్‌లో మద్యం సేవించారు. అయితే, పూర్తిగా కర్ఫ్యూ నిర్వహిస్తుండటంలో జిల్లా కేంద్రంలో అన్ని షాపులు బంద్ చేశారు. అనంతరం మర్రిగూడ వచ్చి.. నార్కట్‌పల్లి అద్దంకి హైవేపై ఏదైనా హోటల్లో చపాతి తినడానికి కారులో బయలుదేరినట్లు తెలిసింది.

వల్లభరావు చెరువు సమీపంలోకి రాగానే అతివేగంగా ఉన్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. కారు పల్టీలు కొట్టుకుంటూ, రోడ్డు పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదం సమయంలో శ్రీకాంత్, వెంకటేశ్వర్ గౌడ్ కారులోనుంచి బయటకు ఎగిరిపడటంతో అక్కడికక్కడే మృతిచెందారు. రాత్రి కావడంతో వెనుక నుంచి వచ్చే వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఇద్దరూ మృతిచెందారని వైద్యులు నిర్ధారించారు. రెండు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. వెంకటేశ్వర్ గౌడ్‌కు ఈ మధ్యనే వివాహం కాగా, భార్య మూడు నెలల గర్భవతి అని తెలుస్తోంది. శ్రీకాంత్ గౌడ్‌కు వివాహం కాలేదు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని టూటౌన్ ఎస్ఐ నర్సింహులు తెలిపారు.


Next Story

Most Viewed