- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రియురాళ్ల ఐఫోన్ల మోజులో కటకటాల పాలైన మైనర్లు!
తమ ప్రియురాళ్లకు ఖరీదైన ఐఫోన్లు కొనివ్వాలనే ఆశతో ఇద్దరు మైనర్ యువకులు ఏకంగా రూ.6.5 లక్షల విలువైన లగ్జరీ డిజైనర్ కుళాయిలను (ట్యాప్స్) దొంగిలించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తమ ప్రియురాళ్లకు ఖరీదైన ఐఫోన్లు కొనివ్వాలనే ఆశతో ఇద్దరు మైనర్ యువకులు ఏకంగా రూ.6.5 లక్షల విలువైన లగ్జరీ డిజైనర్ కుళాయిలను (ట్యాప్స్) దొంగిలించారు. అయితే, లక్షల విలువైన ఆ వస్తువులను కేవలం రూ.20 వేలకే ఓ స్క్రాప్ డీలర్కు అమ్మేసి, 24 గంటలు గడవకముందే పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన ఈ వింత దొంగతనం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. నాగ్పూర్లోని కల్మనా ప్రాంతంలో ఉన్న ‘రాహుల్ సిరామిక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ గోడౌన్లో మే 27, 28వ తేదీల మధ్య రాత్రి ఈ చోరీ జరిగింది. గోడౌన్ పైకప్పు (టిన్ షీట్స్) తొలగించి లోపలికి ప్రవేశించిన ఇద్దరు మైనర్ యువకులు.. గోల్డ్, రోజ్ గోల్డ్, సిల్వర్ రంగుల్లో ఉన్న ఖరీదైన లగ్జరీ శానిటరీ వస్తువులను అపహరించారు. ఉదయం గోడౌన్ యజమాని రాహుల్ జైచంద్ బాత్రా పైకప్పు కత్తిరించి ఉండటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీసీటీవీ ఫుటేజీతో దొరికిపోయిన దొంగలు
ఫిర్యాదు అందుకున్న వెంటనే కల్మనా పోలీసులు రంగంలోకి దిగారు. చుట్టుపక్కల ఉన్న దాదాపు 25కు పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి, తమకున్న సమాచార వ్యవస్థ ద్వారా కేవలం 12 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో విస్తుపోయే నిజాలు
పోలీసుల విచారణలో ఆ మైనర్లు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. తమ గర్ల్ఫ్రెండ్స్ ఐఫోన్ కావాలని పట్టుబట్టారని, ఆ ఖర్చుల కోసం డబ్బులు లేకనే తాము ఈ దొంగతనానికి పథకం పన్నినట్లు వారు అంగీకరించారు. తాము దొంగిలించిన రూ.6.5 లక్షల విలువైన డిజైనర్ శానిటరీ సామగ్రిని యశోధరనగర్కు చెందిన ఇర్ఫాన్ అలీ అలియాస్ ఇమ్ము (38) అనే స్క్రాప్ వ్యాపారికి కేవలం రూ.20 వేలకే అమ్మేసినట్లు చెప్పారు. దీంతో దొంగిలించిన వస్తువులను కొనుగోలు చేసిన ఇర్ఫాన్ అలీని పోలీసులు ప్రధాన నిందితుడిగా అరెస్ట్ చేశారు. చోరీకి గురైన మొత్తం సామగ్రిని స్వాధీనం చేసుకుని, నిందితులపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కల్మనా పోలీస్ సబ్-ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ రామ్లోద్ వెల్లడించారు. ఐఫోన్ల మోజులో పడి యువకులు తమ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ అని స్థానికులు చర్చించుకుంటున్నారు.






