ప్రాణం తీసిన రూ.500.. స్నేహితునిపై కంట్రోల్ తప్పి..!

by  |
500rs
X

దిశ, నిజామాబాద్ రూరల్ : ప్రస్తుత సమాజంలో స్నేహం కోసం ప్రాణాలిచ్చే రోజులు పోయి.. పైసల కోసం స్నేహితులే ప్రాణాలు తీసే రోజులు వచ్చాయి. ఈ క్రమంలోనే డబ్బుల కోసం ఇద్దరు మిత్రుల మధ్య తలెత్తిన వివాదం ఒకరి ప్రాణాలు తీసే వరకు వెళ్లింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా రూరల్ మండలంలోని మల్లారం గ్రామంలో శుక్రవారం సాయంత్రం వెలుగుచూసింది. ఎస్సై బాల్ రెడ్డి కథనం ప్రకారం.. ఈ నెల 4వ తేదీన మల్లారం కల్లు కాంపౌండ్‌లో జగడం విఠల్, తోట జయకృష్ణ, జగడం గంగారాంలు అతిగా కల్లు సేవించారు. అయితే, జగడం విఠల్ వద్ద స్నేహితుడు జయకృష్ణ గత కొన్ని రోజుల కిందట రూ.500 అప్పుగా తీసుకున్నాడు. తన డబ్బులు తిరిగి ఇచ్చేంత వరకు కల్లు కాంపౌండ్ నుండి కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నాడు. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య మాటామాటా పెరగడంతో తీవ్ర ఘర్షణకు దారి తీసింది. తోట జయకృష్ణతో పాటు జగడం గంగారాంలు మత్తులో విఠల్‌ను తీవ్రంగా గాయపరిచారు.

విఠల్ కల్లు కంపౌండ్‌లోనే స్పృహ తప్పి పడిపోయాడు. గ్రామస్థులు విఠల్‌ పరిస్థితిని గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అతన్ని వెంటనే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సన్‌రైజ్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు ఎస్సై బాల్ రెడ్డి తెలిపారు. మృతుడి కుమారుడు జగడం రేవంత్ ఫిర్యాదు మేరకు తోట జయకృష్ణ, జగడం గంగారాంల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. శవాన్ని పంచనామా నిర్వహించి శవపరీక్ష నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు.

Next Story

Most Viewed