మ్యాన్ హోల్‌లోకి దిగిన ఇద్దరు జీహెచ్ఎంసీ కార్మికులు.. అంతలోనే

by  |
మ్యాన్ హోల్‌లోకి దిగిన ఇద్దరు జీహెచ్ఎంసీ కార్మికులు.. అంతలోనే
X

దిశ, ఎల్బీనగర్ : డ్రైనేజీ క్లీన్ చేస్తూ ఇద్దరు జీహెచ్ఎంసీ ‌‌‌‌ఔట్ సోర్సింగ్ కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన హైదరాబాద్ వనస్థలిపురం పరిధిలో చోటు చేసుకుంది. ఎల్బీనగర్ వనస్థలిపురం పరిధిలోని పద్మావతి నగర్‌లో మంగళవారం రాత్రి డ్రైనేజీ క్లీనింగ్ కోసం మ్యాన్ హోల్ లోకి దిగిన అంతయ్య, శివ అనే ఇద్దరు వ్యక్తులు ఊపిరాడక అందులోనే మృతి చెందారు. డ్రైనేజీ లోకి దిగి గల్లంతు కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుల్లో ఒకరైనా శివ మృతదేహాన్ని పోలీసులు వెలికితీయగా, అంతయ్య మృతదేహం కోసం గాలిస్తున్నారు.

మృతులు చంపాపేట్, సరూర్ నగర్ ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కాంట్రాక్టర్ సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న మృతుల కుటుంబ సభ్యులు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య పనులతోనే జీవనోపాధి పొందేవారిమని శివ, అంతయ్య కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. కాంట్రాక్టర్ సరైన భద్రతా చర్యలు తీసుకోకుండా రాత్రి సమయంలో ఇటువంటి పనులు చేయాల్సిందిగా ఒత్తిడి తీసుకురావడం వల్లే ఇద్దరు కార్మికులు మృతి చెందారని, ఇటువంటి కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకొని మృతుల కుటుంబ సభ్యులకు పరిహారం అందించాలని స్థానిక కార్పొరేటర్ డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed