దొంగల అవతారమెత్తిన ఇద్దరు మిత్రులు..

by  |
దొంగల అవతారమెత్తిన ఇద్దరు మిత్రులు..
X

దిశ, క్రైమ్ బ్యూరో : ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు స్నేహితులు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. అనేక కేసులు నమోదయ్యాయి. పలుమార్లు జైలుకెళ్లారు. అయినా ప్రవర్తన మార్చుకోని ఆ స్నేహితులు ఖమ్మం జిల్లా నుంచి రాష్ట్ర రాజధానికి మకాం మార్చారు. ఒకరు కారు డ్రైవర్‌గా, మరొకరు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూనే తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్ చేస్తూ రాచకొండ కమిషనరేట్ పరిధిలో దొంగతనాలు ప్రారంభించారు. హయత్ నగర్‌లోని స్వాతి వైన్స్ సమీపంలోని ఓ జ్యుయలరీ షాపు వద్ద అనుమానాస్పదంగా కనిపించిన వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, పాత నేరస్థులుగా తేలింది.

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మల్లన్నపాలెంనకు చెందిన షేక్ రఫీ (35), ఖమ్మం త్రీ టౌన్ గ్రేయిన్ మార్కెట్‌కు చెందిన మండల నవీన్‌లు స్నేహితులు. పేకాట, మద్యం తదితర దురాలవాట్లతో పాటు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. దాంతో 2008 నుంచి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం అర్బన్, రూరల్, ఖమ్మం 1 టౌన్, 2 టౌన్, ఖానాపురం హావేలి, కూసుమంచి, ఏపీలోని కృష్ణా, పశ్చిమ గోదావరి, కడప తదితర జిల్లాల్లో మొత్తం 40 కేసులు ఉన్నాయి. ఖమ్మం అర్బన్ పీఎస్ పరిధిలో గతంలో పీడీ యాక్ట్ నమోదయ్యింది. 2014 నుంచి ఖమ్మం, కృష్ణా జిల్లాలో సుమారు 10 కేసులు బుక్ అయ్యాయి. ప్రస్తుతం పెద్ద అంబర్ పేట చెక్‌పోస్టు సమీపంలో నివసిస్తున్న వీరు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, ఎల్‌బీ నగర్, ఘట్కేసర్, నార్కట్ పల్లి, చివ్వెంల తదితర పోలీస్ స్టేషన్లలో సుమారు 13 దొంగతనాలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.

వీరి నుంచి సుమారు 110 గ్రాముల బంగారం, 128 గ్రాముల వెండి, 2 ఎల్‌ఈడీ టీవీలు, బజాజ్ పల్సర్ బైక్, రూ.23 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీరిద్దరిని హయత్ నగర్ డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ బి.నాగర్జున కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి, హయత్ నగర్ ఇన్ స్పెక్టర్లు సురేందర్, నాగర్జునలను సీపీ మహేష్ భగవత్ అభినందిండమే కాకుండా, నిందితులపై పీడీ యాక్ట్ బుక్ చేస్తామని సీపీ తెలిపారు.


Next Story

Most Viewed