‘తానా’లో ఈ ఏడాది రెండు నవలలకు బహుమతి

by  |
Tana
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు నవలా సాహిత్యానికి పునర్వైభవం తీసుకురావాలన్న ఆకాంక్షతో 1997లో లాస్‌ ఏంజెల్స్‌ నగరంలో జరిగిన ‘తానా’ మహాసభల మొదటిసారిగా నవలల పోటి నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ మొదటి పోటీలో చంద్రలత రచించిన ‘రేగడి విత్తులు’ నవల రూ.1,30,000 ల బహుమతి గెలుచుకున్న ఏకైక నవలగా నిలిచింది. నాటినుంచి 2007 వరకు తానా నవలల పోటీ నిర్వహించింది. మధ్యలో కొంతకాలం ఆపి, మళ్లీ 2017లో తిరిగి ప్రారంభించింది. ఈ సందర్భంగా 2019లో నిర్వహించిన నవలల పోటీల్లో ప్రకటించిన 2 లక్షల బహుమతి సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన ‘కొండపొలం’ నవలకు లభించింది. తాజాగా.. ఈ నవల ప్రముఖ దర్శకులు క్రిష్ దర్శకత్వంలో సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీంతో ఈ పోటీలో పాల్గొన్న రచయితలకు, న్యాయ నిర్ణేతలకు, పోటీ నిర్వాహణలో సాయపడిన కథాసాహితి సంస్థకు వాసిరెడ్డి నవీన్‌కు తానా కృతజ్ఞతలు తెలిపింది.

కరోనా కారణంగా 2021లో జరగాల్సిన మహాసభలు జరుగకపోయినప్పటికీ, ఆనవాయితీగా వస్తోన్న ‘తానా నవలల పోటీ’ని మాత్రం ప్రకటించింది. దీంతో ఈ పోటీకి దేశంలోని అనేక ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి 107 నవలలు పోటీకి వచ్చాయి. అందులో విశాఖపట్టణానికి చెందిన చింతకింది శ్రీనివాసరావు రచించిన ‘మున్నీటి గీతలు’, అనంతపురానికి చెందిన బండి నారాయణ స్వామి రచించిన ‘అర్ధనారి’ ఎంపికయ్యాయి. దీంతో ఈ నిర్వాహకులు ఈ నవలలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ప్రకటించిన రెండు లక్షల బహుమతి మొత్తాన్ని రెండు నవలలకు సమానంగా ఇవ్వాలని న్యాయనిర్ణేతలు ఏకగ్రీవంగా నిర్ణయించాయి. బహుమతి గెల్చుకొన్న రచయితలకు తానా బృందం అభినందనలు తెలిపింది.

TANA

Next Story

Most Viewed