తెలంగాణ మంత్రులకు ‘ట్విట్టర్’ షాక్..

by  |
తెలంగాణ మంత్రులకు ‘ట్విట్టర్’ షాక్..
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాదీ నెటిజన్స్ ఇటు మంత్రులకు, అటు జీహెచ్ఎంసీకి ఒకేసారి ఝలక్ ఇచ్చారు. నాలుగు రోజుల క్రితం ఓ నెటిజన్ చేసిన ట్విట్టర్‌ పోస్టుకు జీహెచ్ఎంసీ స్పందించక తప్పలేదు. గ్రేటర్ పరిధిలో అనధికార ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను కట్టడి చేసేందుకు జీహెచ్ఎంసీ జరిమానా విధిస్తున్న నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను కూడా పరిగణలోకి తీసుకుంటున్న విషయం విధితమే.

ఈ నెల 27న మత్స్యశాఖ ఆధ్వర్యంలో సంచార విక్రయ శాఖల పంపిణీని నెక్లెస్ రోడ్ హెచ్ఎండీఏ మైదానంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రులకు స్వాగతం చెబుతూ దారిపోడవునా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వీటిని ఫోటోలు, వీడీయో తీసి ట్విట్టర్ ఖాతాలో జీహెచ్ఎంసీ, కేటీఆర్‌లను ట్యాగ్ చేస్తూ యూ.శ్రీనివాసులు పేరుతో అదే రోజు పోస్టు చేశారు.

నాలుగు రోజులుగా ప్రతీ రోజూ పదేపదే పోస్టును హైలెట్ చేస్తుండటంతో తప్పని పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం మంగళవారం మూడు ఈ- ఛలాన్లు జనరేట్ చేసింది. పదుల సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా.. కేవలం మూడింటి మీద కలిపి రూ.85వేల జరిమానా విధించారు. అయితే ఛలాన్లను కూడా కమిషనర్, మత్స్యశాఖ పేరుతో ఇవ్వడం గమనార్హం.. ముఖ్యమంత్రి కేసీఆర్, హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్‌ ఫోటోలతో ఈ ఫ్లెక్సీలు ఉన్నాయి.

అయితే అన్ని ఫ్లెక్సీలపై మూడు ఛలాన్లను ఈవీడీఎం మత్స్యశాఖను అడ్రస్ చేస్తూ జారీ చేసింది. అయితే ప్రతీ ఫ్లెక్సీకి విడివిడిగా ఛలాన్లు వేసేందుకు జీహెచ్ఎంసీకి అవకాశం ఉన్నప్పటికీ అధికారులు దాటవేశారని ఆరోపణలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో నాలుగు రోజుల తర్వాత ఛలాన్లు జనరేట్ చేయక తప్పని స్థితిలో.. అది కూడా ప్రభుత్వ శాఖపైనే విధించడం కూడా విమర్శలకు కారణమవుతోంది. ఫ్లెక్సీలపై ఎక్కడా మత్స్యశాఖ లేకపోయినా శాఖపై ఎలా ఫైన్ వేస్తారని, వాళ్లందరికీ కలిపి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు ఫైన్ వసూలు చేయడం లేదో తెలుసుకోవాలని ఉందంటూ కె. సతీష్ ట్విట్టర్‌ ద్వారా జీహెచ్ఎంసీని కోరారు.


Next Story

Most Viewed