ఇకపై ప్రతి ఆర్టీసీ బస్‌లో ట్విట్టర్ పిట్ట!

by  |
Sajjanar
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు తీసుకుంటున్న నిర్ణయాలతో సంస్థలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. ఇన్ని రోజులు డైనమిక్ పోలీస్ ఆఫీసర్‌గా పనిచేసి పేరుతెచ్చుకున్న సజ్జనార్ ఆర్టీసీలోనూ తన మార్క్ చూపిస్తున్నారు. ఇందులో భాగంగా ఆర్టీసీని క్రమశిక్షణలో పెట్టేందుకు కార్మికులకు ఇప్పటికే తగు సూచనలు చేశారు. అదే విధంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రయాణికుల సమస్యలను, సూచనలను తెలుసుకునేందుకు సిద్ధమయ్యారు.

ఈ క్రమంలో ఇప్పటికే ట్విట్టర్ అకౌంట్‌లో ఉదయం నుంచి రాత్రి వరకూ యాక్టీవ్‌గా ఉంటూ నెటిజన్లు వేసిన ప్రశ్నలకు సమాధానాలిస్తున్నారు. అయితే, ఇప్పటి వరకూ బస్‌లో ప్రయాణిస్తుంటే డ్రైవర్, కండక్టర్ల వల్ల తలెత్తే అసౌకర్యాలను ఫిర్యాదు చేసేందుకు బస్సులోనే RM&DM ఫోన్ నెంబర్లు ఉండేవి. అయితే, వారికి ఫోన్ చేసి తెలిపేందుకు ప్రయాణికులు ఇబ్బందిపడేవారు. మారుతున్న సాంకేతికతతో సోషల్ మీడియా(ట్విట్టర్) వేదికగా తెలిపే సౌకర్యాన్ని సజ్జనార్ తీసుకొచ్చారు. ఇందులో బస్సులు రాకపోయినా, సమయానికి రాకపోయినా, అసౌకర్యంగా ఉన్నా, మరే ఇతర సమస్యలున్నా తెలియజేయవచ్చు.

అయితే దీనికోసం ప్రతి డిపోకు ఒక ట్విట్టర్ ఖాతాను ఏర్పాటు చేయాల్సిందిగా సజ్జనార్ ఆదేశించినట్లు తెలుస్తోంది. తద్వారా సంబంధిత కంప్లైంట్‌ను ఆయా డిపోలకు పంపించడం ద్వారా సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోనున్నారు. ప్రయాణికుల సమస్యలను తెలుసుకుని స్పందించడమే ముఖ్య ఎజెండాగా పనిచేయాలని ఎండీ సూచించినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటి నుంచి ప్రతి ఆర్టీసీ బస్‌లో డీఎం, ఆర్ఎం, ఫోన్ నంబర్లతోపాటు ట్విట్టర్ అకౌంట్ ఐడీ కూడా ప్రదర్శించనున్నారు. ఏది ఏమైనా సజ్జనార్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఇటు ప్రయాణికులు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed