నగరంలో 22 కొత్త కేసులు; ముగ్గురి మృతి

by  |
నగరంలో 22 కొత్త కేసులు; ముగ్గురి మృతి
X

– మళ్లీ పెరుగుతున్న కరోనా పాజిటివ్
– సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం
– వైద్యారోగ్య శాఖ అప్రమత్తం

దిశ, న్యూస్ బ్యూరో : గత వారం రోజులుగా తగ్గుముఖం పడుతోందనుకున్న కరోనా వైరస్ మళ్ళీ వ్యాప్తి చెందింది. గడిచిన 24 గంటల్లో 22 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ముగ్గురు కరోనా, ఇతర అనారోగ్య సమస్యలతో చనిపోయారు. కొన్ని రోజులుగా కేసులు తగ్గుతున్న క్రమంలో గురువారం పాజిటివ్ కేసులు పెరగడంతో సీఎం కేసీఆర్ వెంటనే ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేసి వైద్యారోగ్య శాఖను అప్రమత్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వైరస్ వ్యాప్తి చెందకుండా, కేసులు మరింత పెరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ‘పహాడీషరీఫ్, జల్‌పల్లికి చెందిన ఇద్దరు వ్యక్తుల వల్ల మలక్‌పేట్ గంజ్ మార్కెట్‌లో ముగ్గురు షాపుల యజమానులకు, వారి ద్వారా కుటుంబ సభ్యులకు వైరస్ వ్యాప్తి జరిగింది. ఈ కుటుంబాలన్నింటినీ ఐసొలేషన్‌లో ఉంచాం. మలక్‌పేట్ గంజ్, పహాడీషరీఫ్ ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించాం. తగిన చర్యలు తీసుకుంటున్నాం’ అని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

కొత్తగా 22 కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1068కు చేరుకుంది. కరోనా మృతుల సంఖ్య 33కు చేరుకుంది. ఈరోజు మృతిచెందిన మగ్గురిలో 44 ఏళ్ళ మహిళ కూడా ఉంది. జియాగూడలోని దుర్గానగర్‌కు చెందిన ఈ మహిళ వెంటిలేటర్ మీదనే గాంధీ ఆస్పత్రికి వచ్చారని, ఆరు గంటల వ్యవధిలోనే చనిపోయారని, ఈమెకు బీపీ, షుగర్, న్యూమోనియా సమస్యలు ఉన్నాయని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. మరో ఇద్దరిలో ఒకరు వనస్థలిపురానికి చెందిన 76 ఏళ్ళ వృద్ధుడని, గుండె సమస్యలతో పాటు కిడ్నీ, న్యూమోనియాతో బాధపడుతూ గాంధీ ఆస్పత్రిలో చేరిన 24 గంటల్లోనే చనిపోయారని పేర్కొంది. ఇరవై రోజులుగా గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న డాక్టర్.. ట్రీట్‌మెంట్ తర్వాత గురువారం డిశ్చార్జి అయ్యారు. తాజాగా డిశ్చార్జి అయిన 33 మందితో కలిపి ఇప్పటివరకు 442 మంది కోలుకుని ఇండ్లకు చేరుకున్నారు.

కింగ్ కోఠి ఆసుపత్రిలో టాయ్‌లెట్ల కొరత : కేంద్ర బృందం

గత ఆరు రోజులుగా నగరంలో పర్యటిస్తున్న అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం గురువారం కోఠిలోని మెటర్నిటీ ఆసుపత్రిని సందర్శించింది. అంతకుముందు కింగ్ కోఠి ఆసుపత్రిని కూడా సందర్శించింది. అయితే కింగ్ కోఠి ఆసుపత్రిలో సౌకర్యాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అక్కడ పేషెంట్లకు, వైద్య సిబ్బందికి ఒకే కారిడార్ ఉందని, టాయ్‌లెట్లు కూడా కొన్ని కామన్‌గానే ఉన్నాయని, వార్డుల్లో అటాచ్డ్ టాయ్‌లెట్లు లేవని అసంతృప్తి వ్యక్తం చేసింది. వెంటనే పేషెంట్లకు, వైద్య సిబ్బందికి వేర్వేరు కారిడార్లు ఉండేలా మార్పులు చేయాలని, అటాచ్డ్ టాయ్‌లెట్లు లేని వార్డుల్లో కరోనా పేషెంట్లను చేర్చవద్దని వైద్యులకు సూచించింది. ఐదు రోజులుగా నగరంలో పర్యటిస్తూ వివిధ ఆసుపత్రులు, వలస కార్మికుల షెల్టర్లు సందర్శించి కేంద్రానికి సమాచారం ఇచ్చింది. దీని ఆధారంగా కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్యసలీల శ్రీవాస్తవ ఢిల్లీలో మీడియాకు పై వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో పీపీఇ కిట్లు, టెస్టింగ్ కిట్లు, మాస్కులు మాత్రం తగిన సంఖ్యలోనే ఉన్నాయని, కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది మొదలు డిశ్చార్జి అయ్యి ఇంటికి చేరి ‘హోమ్ క్వారంటైన్‌’లో ఉన్నంత వరకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పరిశీలనా ప్రక్రియ జరుగుతోందని ఆమె తెలిపారు.

Tags : Telangana, Corona, Positive, Deaths, Malakpet, Containment Zones, Central Team

Next Story

Most Viewed