ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటుకు టీవీఎస్ మొగ్గు..

by  |
ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటుకు టీవీఎస్ మొగ్గు..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ టూ-వీలర్ వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకోవడానికి కొత్త అనుబంధ సంస్థను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. ఎలక్ట్రిక్ మొబిలిటీ వ్యాపారాన్ని నిర్వహించేందుకు అనుబంధ సంస్థ ఏర్పాటుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ విభాగంలో సామర్థ్యాన్ని పెంచేందుకు కంపెనీ రూ. 1,000 కోట్ల పెట్టుబడితో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కే ఎన్ రాధాకృష్ణన్ చెప్పారు. ప్రస్తుతం టీవీఎస్ సంస్థ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో ఐక్యూబ్ వాహనాన్ని మార్కెట్లో విక్రయిస్తోంది. 2020, జనవరిలో ఈ వాహనాన్ని తీసుకొచ్చింది.

ఈ స్కూటర్‌ను దేశవ్యాప్తంగా 33 నగరాల్లో విక్రయిస్తోంది. ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేక అనుబంధ సంస్థను ఏర్పాటు చేయడం ద్వారా దేశీయంగానే కాకుండా ప్రపంచ మార్కెట్లో సైతం ఉనికిని విస్తరించడానికి వీలవుతుందని రాధాకృష్ణన్ తెలిపారు. త్వరలో మరిన్ని కొత్త ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) ఉత్పత్తులను తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం టీవీఎస్ మోటార్ కంపెనీ భారత మార్కెట్లో ఒకే ఒక ఐక్యూబ్ ఈవీ స్కూటర్‌ను కలిగి ఉంది. గత నెలలో ఈవీ విభాగంలో పట్టుకోసం ప్రముఖ టెక్ కంపెనీ, ఈగో కంపెనీలో 80 శాతం వాటాను 17.9 మిలియన్ డాలర్ల(రూ. 134 కోట్ల)కు కొనుగోలు చేసింది. ఈగో కంపెనీ ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఈ-బైకులు, ఈ-కార్గో బైకులు, ఈ-స్కూటర్లను కలిగి ఉంది.


Next Story

Most Viewed