తుమ్మలకు ఇక పొగేనా.. ఖమ్మంలో అగ్గి రాజుకుందా..!

by  |
తుమ్మలకు ఇక పొగేనా.. ఖమ్మంలో అగ్గి రాజుకుందా..!
X

దిశ, ఖమ్మం ప్రతినిధి: ఒకప్పుడు ఆయన రాష్ట్ర రాజకీయాలను కనుచూపుతో శాసించారు. మూడు దశాబ్దాలకు పైగా ఓ వెలుగు వెలిగి రాజకీయ దురంధరుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన తెలియనివారుండరంటే అతిశయోక్తి కాదు. ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఎక్కడ ఉన్నా అభివృద్ధే మంత్రంగా పనిచేస్తూ తనకంటూ ఓ గుర్తింపు పొందారు. ఆయనే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తెలుగుదేశం పార్టీలో మూడు దశాబ్దాలకు పైగా ఉండి ఎన్నో పదవులను అలంకరించారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో గులాబీ కండువా కప్పుకున్నారు.. అంతే.. అప్పటి వరకు కమ్యూనిస్టులకు, కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఖమ్మం.. గులాబీ మయం అయింది.

అలాంటి నేత కేసీఆర్‌తో మంచి సాన్నిహిత్యం ఉండడం వల్ల పార్టీలో కొంత కాలం ఓ వెలుగు వెలిగి ఇప్పుడు తెరమరుగయ్యారు.. అంతేనా..? లేదు.. లేదు.. తెరమరుగయ్యేలా చేశారంటారు ఆయన సన్నిహితులు. రాష్ట్రంలో 2023 ఎన్నికల హడావుడి ఇప్పటి నుంచే కనిపిస్తోంది. కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. కాంగ్రెస్‌కు కూడా కొత్త జవసత్వాలు సంతరించుకున్నాయి. ఇక బీజేపీ సైతం ఈటల రాజేందర్ చేరికతో మంచి ఊపుమీదుంది.. అధికార పార్టీ టీఆర్ఎస్‌లోనూ సందడి వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటి వరకూ స్తబ్దుగా ఉన్న నేతలు ఒక్కసారిగా మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. మరికొందరేమో వచ్చే ఎన్నికల కోసం ఇప్పటినుంచే కొత్తదారులు వెతుక్కుంటున్నారు. ఇంకొందరు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సీనియర్ నేతగా పేరున్న తుమ్మల పరిస్థితి ఏంటంటూ స్టేట్ పాలిటిక్స్‌లో ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తోంది.

అన్ని పార్టీల ఎదురు చూపు..

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అలాంటి నేత కోసం అన్ని పార్టీలూ ఎదురు చూస్తున్నాయి. ఓ వైపు బీజేపీ తమ పార్టీలోకి ఆహ్వానించినట్లు గతంలో సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొట్టినా దానిని తుమ్మల మాత్రం ఖండించారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పీసీసీ బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి కూడా తెలుగుదేశం నుంచి వచ్చిన వారే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సైతం తుమ్మల వస్తే కచ్చితంగా ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉందని రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది. షర్మిల పార్టీ నేతలు సైతం తుమ్మలపై ఓ కన్నేసినట్లు ఆ పార్టీ వర్గీయులే చర్చించుకోవడం గమనార్హం.

అధికార పార్టీలో మంచిరోజులొచ్చేనా..?

తుమ్మల నాగేశ్వరరావు కేసీఆర్‌కు మొదటి నుంచి అత్యంత సన్నిహితుడు. ఒక విధంగా చెప్పాలంటే తుమ్మల చేరాకే ఖమ్మం జిల్లా గులాబీ గుమ్మంగా మారింది. ఈ క్రమంలోనే ఆయన హవా టీఆర్ఎస్‌లో కొంతకాలం నడిచింది. ఆ తర్వాత పరిస్థితుల నేపథ్యంలో ఆయన ప్రభావం తగ్గింది. రానురానూ ఓ పెద్దనేత కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గంలోనూ అనేక విభేదాలు తలెత్తడంతో కొంతకాలంగా నాగేశ్వరరావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అధికార పార్టీ ఎవరినీ వదులుకునే పరిస్థితిలో లేదనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో తుమ్మలకు మళ్లీ పూర్వ వైభవం వస్తుందా..? లేక పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుందా..? అనేది త్వరలో తేలనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అభిమానుల్లో తీవ్ర నైరాశ్యం..

మూడున్నర దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన తుమ్మల పరిస్థితిని ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఉన్న ఆయన వర్గీయులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయాల్లో చేరిన నాటినుంచి ఎన్నో పదవులను అలంకరించిన నేత ఇప్పడు ఏ పదవీ లేకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. సీనియర్ నేతను ఇలా పక్కకు పెట్టడాన్ని సహించడం లేదు. తమ నేతకు మళ్లీ పూర్వ వైభవం రావాలని, వస్తే ఏ అవకాశాన్నీ వదులుకోబోమని తుమ్మల అత్యంత సన్నిహితులు స్పష్టం చేస్తున్నారు.

అంతర్మథనంలో తుమ్మల..

ఖమ్మం జిల్లాను గులాబీ మాయంగా మార్చిన తనను పార్టీలో పక్కకు పెట్టడంపై తుమ్మల నాగేశ్వరరావు అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక సన్నిహితులను సలహాలు కూడా అడుగుతున్నట్లు పార్టీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు పార్టీ భవిష్యత్తు కోసం, ప్రభుత్వ పనితీరుకు సంబంధించి సలహాలు, సూచనలు అడిగిన వారు ఇప్పుడు కనీసం మొహం కూడా చూడట్లేదని లోలోపల బాధపడుతున్నట్లు చెబుతున్నారు. ఖమ్మాన్ని అభివృద్ధి బాట పట్టించి, సుందరంగా తీర్చిదిద్దానని, భక్తరామదాసు ప్రాజెక్టు అత్యంత వేగంగా పూర్తిచేయించి పార్టీకి పేరు తెచ్చానని.. అయినా తన పరిస్థితిని ఇలా చేశారనే బాధ తుమ్మలను ఇబ్బంది పెడుతోందని సమాచారం. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో చూద్దామంటూ వేచిచూసే ధోరణిలో ప్రస్తుతం ఆయన ఉన్నట్లు చర్చ జరుగుతోంది.

గతంలోనే కొట్టిపారేశారు..

రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తున్న బీజేపీ.. గులాబీ పార్టీలోని అసంతృప్తులను, సీనియర్ నేతలను తమ పార్టీలోకి లాగాలనే తీవ్ర ప్రయత్నం గతం నుంచే చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావును కూడా కమలం నేతలు సంప్రదించారని, అతి త్వరలో బీజేపీలో చేరడం ఖాయమంటూ గతంలో సోషల్ మీడియాలో పుకార్లు వచ్చాయి. తమ నేతకు బీజేపీలో మంచి ఆఫర్ వచ్చిందని, ఇక తమ భవిష్యత్‌కు అయితే ఇబ్బందిలేదని తుమ్మల వర్గీలు సైతం మాట్లాడుకోవడం అప్పుడు కూడా చర్చకు దారితీసింది. అయితే మొదట ఈ ప్రచారాన్ని లైట్ తీసుకున్న ఆయన పుకార్లు తీవ్ర తరం కావడంతో.. తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఖమ్మం సీపీకి కొంతమంది టీఆర్ఎస్ శ్రేణుల మీదే గతంలో ఫిర్యాదు చేయడం గమనార్హం.


Next Story

Most Viewed