టీపీసీసీ ఫైట్.. రెడ్డి vs బీసీ..!

by  |
టీపీసీసీ ఫైట్.. రెడ్డి vs బీసీ..!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్‌లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు ఘోర పరాజయాలను పార్టీ నేతలు చవిచూస్తున్న తరుణంలో వాటికి బాధ్యత వహిస్తూ టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే, కొత్త టీపీసీసీ చీఫ్ పదవి ఎవరికి ఇస్తారో అన్న అంశం సర్వత్రా ఆసక్తిని రేపుతుంది. దీంతో పలువురు సీనియర్ నేతలు టీపీసీసీ పదవి తమకే కట్టబెట్టాలని డిమాండ్‌ వినిపిస్తున్నారు. రెడ్డి వర్గానికే కాకుండా బీసీలకు అవకాశం ఇవ్వాలంటున్నారు.

ముఖ్యంగా రేసులో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నట్టు జోరుగా ప్రచారం సాగుతుంది. దీనిపై ఇప్పటివరకు రేవంత్ రెడ్డి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. కానీ, కోమటిరెడ్డి మాత్రం తనకు టీపీసీసీ ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో మిగతా సీనియర్ నేతలు కూడా తమకే అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి వచ్చిన వారికే కాకుండా ఈ సారి టీపీసీసీ బీసీలకు ఇవ్వాలని ఇటీవల వీ.హనుమంతరావు అన్నారు. పదవి రేసులో తాను కూడా ఉన్నట్టు తెలిపారు.

టీపీసీసీ రేసులో అంజన్ కుమార్ యాదవ్..

గాంధీభవన్‌లో గురువారం రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జీ మానిక్కం ఠాగూర్ సమావేశం నిర్వహించారు. టీపీసీసీ పదవిపై నాయకుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. ఇదే సమయంలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తన గ్రేటర్ హైదరాబాద్ ఇన్‌చార్జీ పదవికి రాజీనామా చేశారు. తన ప్రమేయం లేకుండానే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టారని అసహనం వ్యక్తం చేశారు. కేవలం హైదరాబాద్, సికింద్రాబాద్‌లకు మాత్రమే ఇన్‌చార్జీగా ఉన్నట్టు చెప్పారు. కానీ, కాంగ్రెస్ పార్టీని మాత్రం వీడనని.. కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేస్తూనే టీపీసీసీ రేసులో తాను కూడా ఉన్నట్టు తేల్చి చెప్పారు.

ఇక అంజన్ కుమార్ కూడా టీపీసీసీ పదవిపై ఆశాభావం వ్యక్తం చేయడంతో పార్టీ అధిష్టానం సందిగ్దతలో పడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం రేసులో ఉన్న ఒక్కరికే ఈ పదవి ఇవ్వడంతో మిగతా వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తుంది అధిష్ఠానం. దీనికి తోడు కమలం బాటలో చాలా మంది కాంగ్రెస్ నేతలు చేరుతుండడంతో పార్టీ హైకమాండ్‌కు మరింత తల నొప్పిగా మారింది. ఒక వేళ సీనియర్ నాయకులు పార్టీని వీడితే.. అదే బాటలో మిగతా నాయకులు కూడా పార్టీ మారే అవకాశం ఉందన్న వార్తలు మరింత కలవరం రేపుతున్నాయి. నాయకుల గ్రూపు రాజకీయల కారణంగానే తెలంగాణ కాంగ్రెస్‌లో పదవి కోసం ఆశావహులు పెరిగారని రాజకీయ విశ్లేషకుల బలమైన అభిప్రాయం.

ప్రస్తుతం ఉన్న నాయకులు ఏకతాటిపైకి వచ్చి పార్టీ ఉనికి కాపాడుకోవాలని లేని పక్షంలో తెలంగాణలో కాంగ్రెస్ భవిష్యత్తు ప్రశ్నార్థకం కానుందని విశ్లేషకులు హెచ్చరికలు కూడా చేస్తున్నారు. దీనికి తోడు పలువురు నేతలు పార్టీలు మారుతున్న సమయంలో ఇంకా ఎన్ని రోజులు కాంగ్రెస్‌ను మోయాలని కుండ బద్ధలు కొట్టారు. రాష్ట్రంలో అధికార పార్టీకి గట్టి పోటీనిచ్చేది బీజేపీయే అని బహిరంగ ప్రకటన చేశారు. దీంతో బీజేపీ పుంజుకోవడానికి కూడా ప్రధాన కారణం కాంగ్రెస్‌ అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ లీడర్లు ఐక్యమత్యంగా ఉండి వేగం పెంచకుంటే.. ఉనికిని కాపాడుకోవడం కూడా కష్టమే అని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed