శ్రీవారి దర్శనాల సంఖ్య పెంపు.. టీటీడీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు

by  |
ttd
X

దిశ, ఏపీ బ్యూరో : సంక్రాంతి నుంచి శ్రీవారి దర్శనాల సంఖ్యను పెంచుతామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన అన్నమయ్య భవనంలో జరిగిన పాలకమండలి సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. సమావేశం ముగిసిన అనంతరం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..అన్నమయ్య మార్గాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అన్నమయ్య మార్గంలో ఘాట్ రోడ్డు, కాలినడక మార్గాల నిర్మాణాలకు పాలకమండలి ఆమోద ముద్ర వేసింది.

ఈ అంశానికి సంబంధించి నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అలాగే సంక్రాంతి నుంచి దర్శనాల సంఖ్య పెంచాలని నిర్ణయించామని.. అయితే దర్శనాల సంఖ్య పెంపుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాయాలని నిర్ణయించినట్లు వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. తిరుపతిలో ప్రారంభించిన పిడియాట్రిక్ ఆస్పత్రిలో హార్ట్ సర్జరీలు విజయవంతంగా జరుగుతున్నట్లు చెప్పుకొచ్చారు. నెలరోజుల్లో 11మంది చిన్నారులకు హార్ట్ సర్జరీ చేసి ప్రాణాలను కాపాడినట్లు చెప్పుకొచ్చారు. పద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రికి విరాళమిచ్చే దాతలకు ఆర్జిత సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. మరోవైపు హనుమ జన్మస్థలమైన ఆకాశగంగను విరాళాల ద్వారా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.

కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడంతో దెబ్బతిన్న ఆలయాలను పునరుద్ధరించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. మరోవైపు శ్రీవారి ఆలయం ఎదురుగా నిర్మిస్తున్న పరకామణి భవనాన్ని వీలైనంత త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ఆ భవనంలో చిల్లర నాణేల ప్యాకింగ్‌కు రూ.2.80 కోట్లతో యంత్రాలు కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెనుకబడిన ప్రాంతాల్లోని గిరిజనులు, మత్స్యకారులను తీసుకొచ్చి దర్శనాలు చేయించాలన్న నిర్ణయానికి పాలకమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. శ్రీ వేంకటేశ్వర నామకోటి పుస్తకాలను ప్రచురించాలని.. కళ్యాణకట్ట క్షురకులకు పీస్ రేట్ రూ.11 నుండి రూ.15 కు పెంచుతున్నట్లు ప్రకటించారు.

కాంట్రాక్టర్ కింద పనిచేసే కార్మికులను కార్పొరేషన్‌లో కలపలేం

ఎఫ్ఎంస్ కార్మికుల సమస్యను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులతో ఓ కమిటీ వేసినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కార్మికులకు టీటీడీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని.. వారి సమస్యను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి హామీ మేరకు టీటీడీలో పనిచేసే కార్మికులను ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్‌లో కలిపినట్లు క్లారిటీ ఇచ్చారు. కాంట్రాక్టర్ కింద పని చేసే కార్మికులను ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్‌లో కలపలేమని చెప్పుకొచ్చారు. త్వరలో అర్హత కలిగిన ఉద్యోగులతో ప్రత్యేక టీటీడీ ఐటీ వింగ్ ఏర్పాటు చేయబోతున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.


Next Story

Most Viewed