విద్యుత్ బిల్లులు చెల్లించండి

by  |
విద్యుత్ బిల్లులు చెల్లించండి
X

కస్టమర్లకు టీఎస్ఎస్పీడీసీఎల్ ఎండీ రఘుమారెడ్డి విజ్ఞప్తి

దిశ, న్యూస్‌బ్యూరో: ఫిబ్రవరితో పోలిస్తే మార్చి, ఏప్రిల్ నెలల్లో విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తుంటాయని ఈ కారణం వల్లే ఈ ఏడాది ఫిబ్రవరి బిల్లు కాకుండా గతేడాది మార్చి బిల్లును ప్రామాణికంగా తీసుకుని బిల్లులు పంపించామని టీఎస్ఎస్పీడీసీల్ ఎండీ రఘమారెడ్డి చెప్పారు. చాలా అధ్యయనం చేసిన తర్వాతే ఈ పాలసీ రూపొందించామని, దీనికి తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ అనుమతి ఉందని ఆయన తెలిపారు. ఈ ఏడాది కాలంలో ఇల్లు షిప్టైనందు వల్ల తాము వాడని దానికి బిల్లు వచ్చిందని ఫిర్యాదులు చేస్తున్న అతి కొద్ది మంది కోసం ప్రత్యేక పాలసీ రూపొందించడం సాధ్యం కాదన్నారు. ఎవరైనా వాడుకున్న దాని కంటే ఎక్కువ బిల్లు చెల్లిస్తే మేలో మీటర్ రీడింగ్ తీసిన తర్వాత ఆ మొత్తాన్ని సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ సంస్థల ఉద్యోగులు కరోనా కష్టకాలంలో రిస్కుచేసి పనిచేస్తున్నందున వారికి జీతాలు, సంస్థలు అప్పులకు వడ్డీలు చెల్లించాల్సి ఉంటుదని, కస్టమర్లు విద్యుత్ బిల్లులు త్వరగా చెల్లిస్తే విద్యుత్ సంస్థలకు సహకరించిన వారవుతారని అన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత విద్యుత్ రంగంలో సాధించిన విజయాలను శనివారం ఆయన మీడియాతో పంచుకున్నారు. తెలంగాణలో డొమెస్టిక్ విద్యుత్ వినియోగం గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం 15 శాతం పెరిగిందని తెలిపారు. లాక్‌డౌన్ వల్ల ప్రజలంతా ఇళ్లలోనే ఉండడంతో విద్యుత్ డిమాండ్ పెరిగిందని వారికి నిరంతర విద్యుత్ సరఫరా చేయడానికి రాష్ట్ర విద్యుత్ సంస్థల కార్మికులు చేస్తున్న కృషి గొప్పదని కొనియాడారు.

లాక్‌డౌన్ వల్ల ఆఫీసులకు వెళ్లలేక ఇంట్లో నుంచి పనిచేస్తున్న ఐటీ ఉద్యోగుల ఇళ్లకు కరెంటు నిరంతర సరఫరా అత్యంత ముఖ్యమని అన్నారు. ఈ రబీలో కోటి టన్నుల ధాన్యం పండిందని ప్రతిరోజు వార్తాపత్రికల్లో చదువుతున్నామంటే దానికి కారణం రాష్ట్ర డిస్కంలు వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించడమేనని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి విద్యుత్ శాఖకు సీఎం కేసీఆర్ రూ.35వేల 800 కోట్లు సాయం చేయడం వల్లే ప్రస్తుతం 15000 మెగావాట్లు సరఫరా చేసే సామర్థ్యం సంపాదించుకోగలిగమని తెలిపారు. తెలంగాణ ఏర్పడినప్పడు 6వేల మెగావాట్లున్న విద్యుత్ డిమాండ్ ఫిబ్రవరిలో 13వేల168 మెగావాట్లకు చేరుకుందన్నారు. 5 సంవత్సరాల్లో విద్యుత్ వినియోగం డబుల్ అవడం అన్నది దేశంలో ఎక్కడా జరగలేదని రఘుమారెడ్డి చెప్పారు.

Tags: telangana, lockdown, power department, employees, power bill, tsspdcl md



Next Story

Most Viewed