అధినేతను తలచె.. అధికారులు తరించె!

by  |
అధినేతను తలచె.. అధికారులు తరించె!
X

గతంలో ఏ ముఖ్యమంత్రికీ లేని ఒక ప్రత్యేకత ఈసారి కేసీఆర్‌కు దక్కింది. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి మొదలు ఐఏఎస్​లు, ప్రభుత్వవిభాగాల పెద్దలను, వివిధ స్థాయిల్లోని అధికారులను తన పుట్టినరోజు వేడుకలను నిర్వహించేలా చేశారు. బర్త్​డే వేడుకల నిర్వహణలో టీఆర్​ఎస్​ నాయకులను, కార్యకర్తలను వెనక్కినెట్టి మరీ అధికారులు అత్యుత్సాహం చూపారు. రెగ్యులర్​గా సోమవారం నిర్వహించే ప్రజావాణితోపాటు సాధారణ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. కార్యాలయాలను వదిలి రోడ్ల మీద పడ్డారు.

కేసీఆర్​ 66 వ పుట్టిన రోజు సందర్భంగా ఒక్కరోజే కోటి మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. సాధారణంగా ఈ పనిని టీఆర్​ఎస్​ నాయకులు, కార్యకర్తలు చేపట్టాలి. గతంలో పనిచేసిన వైఎస్​ఆర్​, చంద్రబాబు నాయుడుసహా ఏ ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకల్లోనూ ప్రభుత్వ అధికారులు నేరుగా పాల్గొనలేదు. ప్రత్యేక అభిమానమున్నవారు ఒక్కరిద్దరు వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు తెలిపేవారు. కేసీఆర్​ పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యకర్తలెవరూ హోర్డింగ్‌లు పెట్టొద్దని, తలా ఒక మొక్కను నాటాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ ట్విట్టర్​ ద్వారా కోరారు. దీన్ని అధికారులు తామే కార్యకర్తలమని భావించారో ఏమోగానీ కేటీఆర్​ ఒక్కటి చెబితే తమ పవర్​, సిబ్బందిని ఉపయోగించి అంతకు మించి అన్నట్టు వందల్లో, వేలల్లో మొక్కలు నాటారు. రాజును మించిన రాజభక్తిని ప్రదర్శించారు. అధికారులు అనుకుంటే ఎంతటిపనైనా సాధ్యమే అని నిరూపించారు.

సాధారణ పరిపాలనాపనులను సైతం ఆపివేసి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్​ కుమార్​, ప్రిన్సిపల్​ సెక్రటరీలు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జలమండలి, జిల్లా కలెక్టరేట్లు, మండల పోలీసు స్టేషన్లుసహా అధికారులందరూ మొక్కలు నాటడంలో బిజీ అయిపోయారు. దీంతో అవసరాల కోసం కార్యాలయాలకొచ్చే సాధారణప్రజలు అధికారులులేక, పనులు జరగకపోవడంతో వెనుదిరగక తప్పలేదు. ప్రగతిభవన్​లో కేసీఆర్​ను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు టీఆర్​ఎస్​ ప్రజాప్రతినిధులు, నాయకులను మించి రాష్ట్రంలోని ఐఏఎస్​లు, ఐపీఎస్​లు పోటీపడ్డారు.

మరో అడుగు ముందుకేసిన హైదరాబాద్​ నగరపాలక సంస్థ 150 వార్డుల్లో మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు గచ్చిబౌలి స్టేడియంలో ‘మియావాకి’ అనే పద్ధతిలో ఒకే రోజు పది వేల మొక్కలు నాటారు. కేసీఆర్​ పుట్టిన రోజు వేడుకలను ఒక ఉద్యమంలా చేపట్టి మరే అత్యవసర పనులు లేనట్టు చేసిన ప్రభుత్వ అధికారుల్లో ఐఏఎస్​, ఐపీఎస్​ క్యాడర్​ కూడా ఉండటం బాధాకరం. ప్రభుత్వానికి ఎలాంటి సంబంధంలేని ఓ కార్యక్రమంలో పోటీపడిన అధికారులు ప్రజలకు సేవలందించే విధులను పక్కనపెట్టి పార్టీ కార్యకర్తల స్థాయిలో వ్యవహరించారు. ఇదే సుపరిపాలనగా భావించారు కాబోలు!

Next Story