తెలంగాణ పర్యాటక రంగానికి నిధులివ్వండి

by  |
kishan-reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనాతో కుదేలైన తెలంగాణ పర్యాటక రంగానికి అధిక నిధులు విడుదల చేసి ఆదుకోవాలని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ కోరారు. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో చేపడుతున్న పర్యాటక ప్రదేశాల అభివృద్ధి కి స్వదేశీ దర్శన్, ప్రసాద్ స్కీం లలో చేర్చి వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కోరారు. పర్యాటకాభివృద్ధి లో భాగంగా స్వదేశీ దర్శన్ స్కీం లో చరిత్రాత్మక కోటల సంరక్షణ , మహబూబ్ నగర్ జిల్లాలోని పిలిగ్రీమేజ్ అండ్ నేచర్ టూరిజం సర్క్యూట్ ను, ప్రసిద్ధ బుద్ధిజం కేంద్రాల అభివృద్ధి చేయాలన్నారు.

ప్రసాద్ స్కీం లో భాగంగా భద్రాచలం లోని సీత రామచంద్ర స్వామి దేవస్థానం, మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మన్యంకొండ వేంకటేశ్వర స్వామి దేవస్థానం లను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. మహబూబ్ నగర్ పట్టణంలో సుమారు రూ.25 కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న కల్చరల్ సెంటర్ కు ఠాగూర్ కల్చరల్ కాంప్లెక్స్ స్కీం ద్వారా 15 కోట్ల రూపాయల ఆర్థిక సహకారం ను అందించాలని, అడాప్ట్ ఏ హెరిటేజ్ స్కీం లో ఎంపికైన గోల్కొండ కోట, అలంపూర్ జోగులంబా దేవాలయం, రామప్ప దేవాలయం ల పనులను తక్షణమే ప్రారంభించాలని కోరారు.

హైదరాబాద్ నగరం ఎంఐసీఈ టూరిజం, మెడికల్ క్యాపిటల్ గా అభివృద్ధి లో చెందుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం లో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ (ఐఐటీటీఎం) క్యాంపస్ ను ఏర్పాటు చేయాలని అందుకు అవసరమైన భూమిని ఉచితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుతుందని అందుకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట తెలంగాణ రాష్ట్ర పర్యటకాభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్, ఈడీ శంకర్ రెడ్డిలు పాల్గొన్నారు.


Next Story

Most Viewed