సర్కార్ సీక్రెట్ ఆపరేషన్.. టార్గెట్ భార్యభర్తలే..!

by  |
సర్కార్ సీక్రెట్ ఆపరేషన్.. టార్గెట్ భార్యభర్తలే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో విపత్తు పొంచి ఉంది. ఉపాధ్యాయులతో పాటుగా అన్ని శాఖల్లో భార్యభర్తలైన ఉద్యోగుల స్పెషల్​జాబితా సిద్ధమవుతోంది. ఈ జాబితాతో ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేస్తోంది. స్పౌస్​ కేసుల్లో బదిలీల ప్రక్రియకు శ్రీకారం చుట్టేందుకు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం.. ఇప్పటి వరకు అదే అంశంలో ఒకేచోటుకు వచ్చిన వారి వివరాలు ఇవ్వాలని ఆయా శాఖల ఉన్నతాధికారులకు సూచించింది. ఆఫ్​ది రికార్డుగా వివరాలన్నీ సేకరిస్తున్నారు. ఎందుకంటే దీనిపై ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

రెండు హెచ్​ఆర్​ఏలా..?

స్పౌస్​ ఆధారంగా ఒకేచోటుకు బదిలీ చేయించుకోవడం ప్రధాన ఉద్ధేశం ఒకేచోట ఉండేందుకు. దీనికి ప్రభుత్వం కూడా ముందు నుంచీ అదే చెప్తోంది. భార్యభర్తలు వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగం చేయడం కరెక్ట్​ కాదని పలుమార్లు సీఎం కేసీఆర్​ ప్రకటించారు. దీనిలో భాగంగా కొంతమందికి డిప్యూటేషన్​ వేస్తే… కొంతమందిని బదిలీ చేయించారు. ఉపాధ్యాయ శాఖలో ఇలాంటి బదిలీలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. కానీ స్పౌస్​ ఆధారంగా చూపిస్తూ బదిలీ అయిన ఉద్యోగులు ఇంటి అద్దె అలవెన్స్​ (హెచ్ఆర్ఏ)లో దొంగ బిల్లులు సమర్పించినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులున్నాయి. ఈ విషయాన్ని ఇప్పటి వరకు తేలిగ్గా తీసుకున్న సర్కారు… ఇప్పుడు మాత్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఒకేచోట ఉండేందుకు అవకాశం కల్పిస్తూ బదిలీలు చేస్తే వారంతా హెచ్ఆర్ఏ కోసం అడ్డదారులు తొక్కుతున్నారంటూ భావిస్తోంది. భార్యభర్తలైన ఉద్యోగులు చాలా ప్రాంతాల్లో రెండు హెచ్​ఆర్​ఏలు తీసుకుంటున్నారని గుర్తించారు. విద్యాశాఖలోనే ఒక విభాగం నుంచి వచ్చిన ఈ ఆరోపణలతో ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టినట్లు సమాచారం. యూనియన్ల పరంగా వివాదాల నేపథ్యంలో కొంతమంది దీనిపై ఫిర్యాదు చేసినట్లు అనుమానిస్తున్నారు. ఉదాహరణగా భార్యభర్తలైన ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు రెండు హెచ్ఆర్ఏలను తీసుకుంటున్న వివరాలను ప్రభుత్వానికి సమర్పించినట్లు సమాచారం. ఒకే ఇంటిలో ఉంటున్నా… భర్త ఒక ఇంటి నెంబర్తో హెచ్ఆర్ఏ తీసుకుంటున్నారని, అదే ఇంటికి, లేకుంటే తప్పుడు రికార్డులతో ఇంకో నెంబర్​ వేసి హెచ్ఆర్ఏ పొందుతున్నట్లు తేలింది. ఇంటి నెంబర్​320గా చూపిస్తూ భర్త… అదే ఇంటి నెంబర్​లో 320/1గా చూపిస్తూ భార్య హెచ్ఆర్ఏ తీసుకుంటున్నట్లు గుర్తించారు. ఇలా చాలా మంది ప్రభుత్వ శాఖల్లో డబుల్​ హెచ్ఆర్ఏ ఫైల్​చేస్తున్నట్లు ప్రభుత్వం అనుమానిస్తోంది.

ఏరేద్దామా..?

ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ ఇచ్చిన ప్రభుత్వం తాజా పరిణామాల్లో డబుల్​హెచ్ఆర్ఏపై దృష్టి పెట్టినట్లు అధికారులు చెప్పుతున్నారు. దీనిలో భాగంగా గతంలో నుంచి స్పౌస్​ కేసుల్లో బదిలీ అయిన వివరాలు సేకరిస్తోంది. ఒక్కోశాఖ నుంచి వివరాలు ఇవ్వాలంటూ ఉన్నతాధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వివరాలను రహస్యంగా ఉంచాని, ఇప్పుడే ప్రచారంలోకి తీసుకురావద్దంటూ సూచించినట్లు అధికారవర్గాల టాక్. ఈ వివరాలన్నీ తీసుకున్న తర్వాత డబుల్​హెచ్ఆర్ఏను ఎంత మంది, ఎంత నగదు తీసుకుంటున్నారనే లెక్కలు తేలుతాయని, దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

స్పౌస్​ కేసుల్లో బదిలీ అయిన వారికి డబుల్​హెచ్ఆర్‌ఏనే తొలగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఆర్థిక శాఖకు చెందిన అధికారి వెల్లడించారు. అంతేకాకుండా స్పౌస్​ కేసును చూపిస్తూ బదిలీ అయినప్పటి నుంచి డబుల్​ హెచ్‌ఆర్ఏను తీసుకుంటే వారి నుంచి తిరిగి రాబట్టేందుకు కూడా ప్రభుత్వం అవకాశాలను పరిశీలిస్తుందంటున్నారు. అవసరమైతే దీన్ని నేరంగా భావించి శాఖాపరమైన చర్యలు తీసుకునే ఛాన్స్​ కూడా ఉందంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఈ వివరాలను సేకరించే పనిలో పడింది. దీంతో ఎంతమంది, ఏయే శాఖల్లో స్పౌస్​ ఆధారంగా బదిలీ అయి రెండు హెచ్‌ఆర్‌ఏలు తీసుకుంటున్న వివరాలన్నీ త్వరలోనే తేలుతాయని ఉద్యోగుల్లో చర్చగా మారింది.

తప్పేకదా..?

మరోవైపు దీనిపై ఉద్యోగ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యాశాఖలోని ఓ ఉపాధ్యాయ సంఘం దీనిపై ఫిర్యాదు చేసినట్లు ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. అయితే కొంతమంది దీన్ని సమర్ధిస్తున్నారు. స్పౌస్​ కేసులో బదిలీలు చేయించుకోవడం, అక్కడ ఉండే వారిని ఎక్కడికో బదిలీ చేయడం కరెక్ట్​ కాదని, ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా భార్యభర్తలు ఒకేచోట ఉండేందుకు బదిలీ చేయించుకుని మోసం చేసే విధంగా రెండు హెచ్​ఆర్​ఏలను తీసుకోవడం తప్పంటున్నారు. స్పౌస్​ కేసుల్లో బదిలీ అయిన వారు విడివిడిగా ఉండే ప్రసక్తే లేదని, ఇది మోసపూరితమేనంటున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే భయం కూడా ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.


Next Story

Most Viewed