మెడికల్ లెక్చరర్స్‌కు బంపర్ ఆఫర్.. భారీగా వేతనాల పెంపు

by  |
మెడికల్ లెక్చరర్స్‌కు బంపర్ ఆఫర్.. భారీగా వేతనాల పెంపు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వం వైద్య విద్య, దంత కళాశాలల్లో పనిజేస్తున్న అధ్యాపకులందరికీ ఇది తీపి కబురు అందించింది. బోధనాసిబ్బందికి భారీగా వేతనాలు పెంచుతున్నట్టుగా ప్రకటించింది. ఏడో సెంట్రల్ ఏ కమిషన్ ఫార్ములా ప్రకారం వేతనాలు వైద్య ఉపాధ్యాయులకు అందనున్నాయి. ఇందుకు సంబంధించిన వేతన సవరణ సర్క్యులర్ మంగళవారం విడుదల చేశారు. పెంచిన వేతన ఫార్ములా 1జనవరి 2016 నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఇటీవల పొరుగు రాష్ట్రంలో వైద్య విద్య అధ్యాపకులకు వేతన సవరణ చేయడంతో భారీగా వేతనాలు పెరిగాయి. ఇక్కడ కూడా ఏడో సెంట్రల్ పే కమిషన్‌ను అమలు చేయాలని వైద్య విద్య అధ్యాపకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సర్కారు అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసినా అమలుకు సర్క్యులర్స్ మాత్రం విడుదల కాలేదు. పొరుగు రాష్ట్రంలో 1 పే కమిషన్ అమలు చేయడం, నాలుగు రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైద్యుల ఓట్లపై దృష్టి పెట్టిన సర్కారు దీన్ని ఇప్పుడు విడుదల చేసింది.

ఏడో పే కమిషన్ అమలు చేయడం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ బోధానస్పత్రుల్లో పనిజేసే 2500 మందికి వేతనాలు పెరగనున్నాయి. ఇందులో ప్రొఫెసర్ నుంచి ట్యూటర్ వరకు ఉన్నారు. కాగా పెరిగిన వేతనాలు 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నప్పటికీ పాత ఏరియర్స్ రావాలంటే అందుకు ప్రత్యేక జీవో జారీ చేయాలని వైద్యులు చెబుతున్నారు. ఏడో పే కమిషన్ అమలుకు సంబంధించిన జీవో గతేడాది సర్కారు సెప్టెంబరులో జారీ చేశారు. నాటి నుంచి ఏరియర్స్ ప్రస్తుతం వస్తాయని వైద్యులు చెబుతున్నారు. పాత వాటికి సంబంధించిన ఏరియర్స్ రావాలంటే ప్రత్యేక జీవో జారీ చేయాల్సివుంటుందంటున్నారు.

హైదరాబాద్ మినహా జిల్లాల్లోని మెడికల్ కాలేజీల్లో పనిజేస్తున్న అసోసియేట్ ప్రొఫెసర్ కు గతంలో రూ.70 వేలు ఉంటే, ప్రస్తుతం రూ.86వేలకు పెరిగింది. అసోసియేట్ ప్రొఫెసర్ కు రూ.84 వేలుంటే రూ.లక్ష అయింది. మూడేళ్లు దాటిన అసోసియేట్ ప్రొఫెసర్ కు గతం లో రూ.1.24 లక్షల వేతనముంటే ప్రస్తుతం రూ.1.60 లక్షలైంది. ప్రొఫెసర్​కు గతంలో రూ.1.30 లక్షలుంటే ప్రస్తుతం రూ.1.80 లక్షలు అయింది. హైదరాబాద్లో పనిజేసే అధ్యాపకులు ఇంతకు మించి వేతనాలుంటాయి.

Next Story

Most Viewed