బైడెన్ గెలవగానే ట్రంప్ ఏం చేశాడంటే..

by  |
బైడెన్ గెలవగానే ట్రంప్ ఏం చేశాడంటే..
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ గెలిచారు. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా మీడియా మొత్తం ఆయన మీదే ఫోకస్ పెడుతోంది. అయితే బైడెన్‌ గెలిచినట్లు ప్రకటన వచ్చిన సమయంలో ఆయనకు గట్టి పోటీనిచ్చిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఫలితం గురించి ఆయన స్పందన ఎలా ఉంది? అనే విషయాల గురించి చాలా తక్కువగా ఫోకస్ చేశారు. సాధారణంగా ఓటమి పాలైనపుడు ఎవరైనా ఏం చేస్తారు? బాధపడతారు లేదంటే కోపంతో ప్రెస్‌మీట్‌లు పెడతారు లేదా ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవడానికి మరేదైనా నచ్చిన పని చేస్తారు. మరి ట్రంప్ ఏం చేశారు?

వర్జీనియాలోని స్టెర్లింగ్‌లో ఉన్న ట్రంప్ నేషనల్ గోల్ఫ్ కోర్స్‌లో డొనాల్డ్ ట్రంప్ గోల్ఫ్ ఆడారు. సరిగ్గా జో బైడెన్ కొత్త అధ్యక్షుడు అని మీడియా ప్రకటిస్తున్న సమయంలో ఆయన గోల్ఫ్ ఆట మధ్యలో ఉన్నారు. ఆ తర్వాత అక్కడ జరుగుతున్న ఒక పెళ్లిలో వధూవరులతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. కానీ అక్కడికి వచ్చిన వారెవరితోనూ సరిగా మాట్లాడలేదని, కేవలం ఫొటోలు దిగి మౌనంగా వెళ్లిపోయారని రిపబ్లికన్ స్ట్రాటజిస్ట్ బ్రయాన్ బార్ట్‌లెట్ తెలిపారు. ఆ తర్వాత నేరుగా గోల్ఫ్ కోర్టుకి వెళ్లి మళ్లీ ఆడటం ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా బ్రయాన్ ట్వీట్ చేశారు. కాగా ఓటమి బాధను గోల్ఫ్ ఆడి పోగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడంటూ కొందరు నెటిజన్లు ఆ వీడియో కింద కామెంట్లు కూడా చేశారు.



Next Story