ఈటల ఓటమే లక్ష్యంగా టీఆర్ఎస్.. అక్కడే మకాం వేసిన మంత్రులు

by  |
ఈటల ఓటమే లక్ష్యంగా టీఆర్ఎస్.. అక్కడే మకాం వేసిన మంత్రులు
X

దిశ ప్రతినిది, కరీంనగర్: హుజురాబాద్‌‌లో ఈటల రాజేందర్ కోటకు బీటలు పడ్డాయి, గులాభి జెండా ఎగురడం ఖాయం అంటూ ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని పట్టు సాధించినా ఇంకా ప్రచారంలో నిమగ్నం ఎందుకు అవుతోంది? ఫిరాయింపులను ఎందుకు ప్రోత్సహిస్తోంది? సొంత పార్టీ వారిని కట్టడి ఎందుకు చేస్తోంది? ఈటల ఓటమే లక్ష్యంగా ఐదు నెలలుగా చేసిన ప్రయత్నాలతో సంతృప్తి చెందలేదా లేక ఇంకా అప్పర్ హైండ్ సాధించలేకపోయారన్న నివేదికలా అన్నదే అంతు చిక్కకుండా తయారైంది.

ముగ్గురు మంత్రులు… సీఎం మానిటరింగ్

హుజురాబాద్‌లో పట్టు బిగించేందుకు ఏకంగా ముగ్గురు మంత్రులు అక్కడే మకాం వేసి సమీకరణాలు మారుస్తున్నారు. తన్నీరు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌లు అన్నీ తామై టీఆర్ఎస్ ను గెలిపించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నారు. వీరితో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు పార్టీ పట్టు బిగించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అడపా దడపా వివిధ శాఖల మంత్రులు కూడా హుజురాబాద్ ను చుట్టేసి సామాజిక వర్గాల వారిగా మంత్రాంగం నడిపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ హుజురాబాద్‌లో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా హుజురాబాద్‌లో సమీకరణాలను మారుస్తున్నారు. తరుచూ ముఖ్యమంత్రి ఇక్కడి ఎన్నికలపై ఆరా తీస్తూ ఇంఛార్జీలతో చర్చలు జరుపుతున్నారు.

నిధుల వరద పారినా…

ఓ వైపు సంక్షేమ కార్యక్రమాలకు కేరాఫ్‌గా మారిన హుజురాబాద్ మరో వైపు నిధుల వరద కూడా పారిందనే చెప్పాలి. ఇక్కడి ఓటర్లను తమకు అనుకూలంగా మల్చుకోవడమే లక్ష్యం అన్న రీతిలో సర్కారు వ్యవహరించిందనే చెప్పాలి. దళిత బంధు నుండి గ్రామాల్లో చేపట్టే అభివృద్ది పనుల వరకు నిధులు కెటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించింది. ఇక్కడి ఓటర్లను ప్రభావితం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సంచలనంగానే మారాయనే చెప్పాలి.

ఈటలను ఒంటరిని చేసినా…

హుజురాబాద్ ఉప పోరులో ఈటలపై టీఆర్ఎస్ పార్టీ సైకలాజికల్ వార్ చేసిందనే చెప్పాలి. టీఆర్ఎస్ పార్టీని వీడిన తరువాత ఈటల రాజేందర్ వెంట నడిచిన ప్రతి ఒక్కరిని బ్యాక్‌టు పెవిలియన్ అని పిలిపించుకున్న టీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఈటల రాజేందర్‌ను ఒంటరిని చేసే ప్రయత్నం చేశారు. ఆయనకు మద్దతు ఇచ్చే ఏ ఒక్కరిని వదలకుండా గులాభి కండువా కప్పేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను, బీజేపీ కౌన్సిలర్లను టీఆర్ఎస్ పార్టీలో చేర్పించుకున్నారు. ఓ రకంగా చెప్పాలంటే బీజేపీకి ఓటేయాలని ప్రచారం చేసే క్యాడర్ ఆయన పంచన లేకుండా చేశారనే చెప్పాలి. దీంతో ఈటల రాజేందర్ స్వయంగా పల్లెలు తిరుగుతూ ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఆయన వ్యతిరేకులను చేరదీయడంతో పాటు వారిచే ఊరు వాడల్లో విస్తృతంగా ప్రచారం చేయిస్తున్నారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని ముందుకు సాగుతున్నారు. చివరకు ఈటలకు అత్యంత పట్టున్న గ్రామాలను గుర్తించి అక్కడ టీఆరెఎస్ పార్టీ పట్టు బిగించే ప్రయత్నాలనూ చేసింది.

సానుకూలత రాలేదా..?

ఇంత జరుగుతున్నా టీఆర్ఎస్ పార్టీకి సానుకూలత వచ్చిందా అన్నది మాత్రం మిస్టరీగానే మారినట్టు స్పష్టం అవుతోంది. ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు పూర్తి స్థాయిలో సఫలం కాలేదా అన్న చర్చ సాగుతోంది. ప్రజల్లో ఈటలపై ఉన్న సానుభూతిని తగ్గించి తమకు అనుకూలంగా మల్చుకునేందుకు ఇంకా సమీకరణాలు చేస్తూనే ఉన్నారు. గులాభి తీర్థం పుచ్చుకున్నప్పటికి కొంతమంది నాయకులు ఈటలతో ఉన్న అనుబంధం మర్చిపోలేకపోతున్నారని, దీంతో వారిలో కొంతమంది సైలెంట్‌గా ఉంటున్నారన్న విషయాన్ని అధిష్టానం గుర్తించినట్టు సమాచారం. నిఘా వర్గాల నివేదికలు, సర్వేలు కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో మెయిన్ లీడర్లు గ్రౌండ్ లెవల్ పాలిటిక్స్ కు తెరతీయక తప్పని పరిస్థితి ఏర్పిడింది. పోలింగ్ జరిగే నాటి వరకూ ఎలా ముందుకు సాగాలి, ఓటర్లను ఎలా ప్రభావితం చేయాలి అన్న విషయంపైనే దృష్టి సారించారు. ఏది ఏమైనా టీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ లో తిరుగులేని పట్టు సాధించినట్టు నేతలు ప్రచారం చేసుకుంటున్నా వారి చేతులు మాత్రం ఇందుకు పూర్తిగా ఉండడం చర్చనీయాశం అయిందనే చెప్పాలి.



Next Story

Most Viewed