‘టీఆర్‌ఎస్ అవినీతి పాలన అంతం కోసం.. త్వరలో శిక్షణ కేంద్రాలు’

by  |
congress leader
X

దిశ, నాగర్ కర్నూల్ : తెలంగాణ రాష్ట్రంలో అక్రమాలు, అవినీతి, దౌర్జన్యం పూరితంగా పాలిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అంతం చేసి, ప్రజలకు స్వేచ్ఛాయుతమైన పాలన అందించేందుకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటు సభ్యులు మాణిక్యం ఠాగూర్ వెల్లడించారు. శుక్రవారం నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థాయి అన్ని నియోజకవర్గాల, మండలాల ముఖ్య కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి ముఖ్య అతిధులుగా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ధైర్యంగా, బాధ్యతగా పని చేస్తూ అవినీతి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అంతం చేసేందుకు కృతనిశ్చయంతో ఉండాలని పిలుపునిచ్చారు. గ్రామ గ్రామాన బూత్ లెవల్ కమిటీలను తిరిగి పునరుద్ధరించు కోవాలని పేర్కొన్నారు.

ఎవరు అధైర్య పడాల్సిన పని లేదని వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే హైదరాబాద్ కేంద్రంగా కార్యకర్తలకు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా మనస్పర్ధలు ఉన్నా వాటిని లోలోపలే సర్దిచెప్పుకొని కార్యకర్తలంతా ఒక తాటిపైకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రధాన కార్యకర్తలపై ఉందని కూడా గుర్తు చేశారు. ప్రధాన శత్రువు కేవలం టీఆర్ఎస్ పార్టీనేనని, ప్రజలకు అవినీతి పాలన నుండి విముక్తి కల్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందని గుర్తు చేశారు. ముందుగా రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏడు నియోజకవర్గాలలోని 45 మండలాల కమిటీ సభ్యులతో పార్టీ బలోపేతం అంశాలపై చర్చించారు.

యూత్ కమిటీ సభ్యులు ఎన్నికైనా ప్రజా సమస్యలపై పోరాటంలో వెనకబడటంపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం మాజీమంత్రి నాగం జనార్ధన్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. స్వరాష్ట్ర సాధన కోసం పోరాడిన తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కరికీ న్యాయం చేయలేదని, వచ్చే ఎన్నికల్లో అవినీతి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అందుకు రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుండి పార్టీని పటిష్టపరిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వారితో పాటు ఏఐసీసీ సెక్రెటరీ పార్లమెంట్ ఇంచార్జి బోస్ రాజు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇంచార్జి మహేష్ గౌడ్, ఏఐసీసీ సెక్రటరీలు మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు రవి, మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇంచార్జి బొల్లు కిషన్ తదితరులు పాల్గొన్నారు.

Next Story