ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన రెబల్స్

by  |
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన రెబల్స్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెబల్స్‎గా పోటీ చేస్తున్న సర్దార్ రవీందర్ సింగ్, సారాబుడ్ల ప్రభాకర్ రెడ్డిలు పోటా పోటీ ప్రచారం చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ పోటీలో నిలబెట్టిన ఇద్దరు అభ్యర్థులను కాదని తమకే ఓటు వేయాలన్న రీతిలో అభ్యర్థిస్తున్నారు. మూడు రోజుల క్రితం వీరిద్దరూ కరీంనగర్‌లోని ఓ హోటల్‌లో మంతనాలు జరిపారు. అయితే వీరిద్దరూ కలిసి తమలో ఎవరికో ఒకరికి ఓటు వేయాలని ప్రచారం చేయాలన్న అంశంపై చర్చించారు. కానీ, ఎవరికి వారే వ్యక్తిగతంగా తమకే ఓటు వేయాలంటే తమకే ఓటు వేయాలన్న ప్రచారం చేసుకుంటుండడం చర్చనీయాంశంగా మారింది. ఈటల రాజేందర్ ఒక ఓటు రవీందర్ సింగ్‌కు మరో ఓటు రమణకు వేయాలన్న భావన వచ్చే రీతిలో పిలుపునిచ్చారు.

రవీందర్ సింగ్ కూడా ఒక ఓటు తనకు మరో ఓటు రమణకు అన్న ప్రచారమే చేస్తున్నట్టుగా సమాచారం. కానీ మరో రెబల్ అభ్యర్థి సైదాపూర్ ఎంపీపీ, ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి కూడా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను కలుస్తూ తనకు ఓటు వేసి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. దీంతో రెబల్స్ ఇద్దరు కూడా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ప్రచార పర్వం కొనసాగిస్తుండడం చర్చనీయాశంగా మారింది. ఆదివారం రామగుండంలో కార్పొరేటర్లను వ్యక్తిగతంగా కలిసిన సారబుడ్ల తనకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. సోమవారం నాడు పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన సర్దార్ రవీందర్ సింగ్ తనకు ఓట్లేయాలని కోరారు. ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచిన రెబల్స్ ఇద్దరూ కూడా ఒకే తాటిపైకి వచ్చి అధికార టీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చేవిధంగా వ్యవహరించడం లేదని తేటతెల్లం అవుతోంది. దీంతో రెబల్స్ భవితవ్యం ఎలా ఉండబోతున్నదన్నదే చర్చనీయాంశంగా మారింది.



Next Story

Most Viewed