MLC ఎన్నికల్లో టీఆర్ఎస్ నయా ట్విస్ట్.. బస్సులెక్కిన లోకల్ లీడర్స్

by  |
MLC ఎన్నికల్లో టీఆర్ఎస్ నయా ట్విస్ట్.. బస్సులెక్కిన లోకల్ లీడర్స్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల రెండో విడుత క్యాంప్ ప్రారంభం అయింది. శనివారం సాయంత్రం జిల్లాలోని 13 నియోజక వర్గాల నుంచి క్యాంపులకు తరలి వెళ్లారు టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓటర్లు. ఆయా నియోజకర్గాల నుంచి హైదరాబాద్ శివార్ల వరకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసిన నాయకులు అక్కడి నుంచి ఏసీ బస్సుల్లో తలరించేందుకు రంగం సిద్దం చేసినట్టుగా తెలుస్తోంది. హుజురాబాద్‌కు చెందిన స్థానిక ప్రజా ప్రతినిధులకు మాత్రం ఏసీ స్లీపర్ క్లాస్ బస్సులను ఇక్కడకే రప్పించారు.

నియోజకవర్గాల వారీగా..

రెండు రోజుల గ్యాప్ తరువాత రెండో విడుత క్యాంప్ ప్రారంభించడంతో నియోజకవర్గ ఇంచార్జీలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశం అయ్యారు. ప్రత్యర్థులు బరిలో ఎక్కువ మంది ఉండడం, బలమైన నాయకులు కూడా రెబల్స్‌గా పోటీ చేస్తుండడంతో ప్రతి ఒక్కరితోనూ ప్రత్యేకంగా ఇంఛార్జీలు మాట్లాడినట్టు సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధిష్టానం ప్రకటించిన అభ్యర్థులకే ఓటు వేయాలని సూచించినట్టు తెలుస్తోంది. కొంతమంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల్లో నెలకొన్న అసంతృప్తిని కూడా తొలగించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించారు. క్యాంపులకు వెళ్లిన వారికి ఫస్ట్ ఫేజ్ గుడ్‌విల్ కూడా ముట్ట చెప్పినట్టు, సెకండ్ ఫేజ్ పోలింగ్ తరువాత ఇచ్చేందుకు ఒప్పుకున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఇంచార్జీలపై వ్యతిరేకంగా ఉన్నారని వారి ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు సమాచారం ఇవ్వడంతో వారిపై స్పెషల్ నజర్ వేశారు. ఆ నియోజకవర్గాల్లోని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో కూడా ప్రత్యేకంగా మాట్లాడి పార్టీకి అనుకూలంగా ఉండే విధంగా ఒప్పించినట్టుగా సమాచారం.

క్రాస్ ఓటింగ్‌కు చెక్..

రెండు ఎమ్మెల్సీ స్థానాలకు గాను జరుగుతున్న ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కూడా జరిగే ప్రమాదం ఉందని టీఆర్ఎస్ అధిష్టానం గుర్తించింది. ఈ విధానానికి చెక్ పెట్టి రెండు ఓట్లు కూడా పార్టీ అభ్యర్థులకే వేయాలన్న ఒప్పందం చేసుకుంటున్నట్టుగా సమాచారం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 996 ఓట్లు మొత్తం కూడా టీఆర్ఎస్ క్యాండిడేట్లకే పడే విధంగా అధిష్టానం వ్యూహరచన చేసినట్టుగా తెలుస్తోంది. ఒక ఎమ్మెల్సీ అటు ఒక ఎమ్మెల్సీ ఇటు అన్న నినాదంతో ప్రత్యర్థులు ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో వారి ఎత్తుగడలు సఫలం కాకూడదని స్కెచ్ వేసినట్టు సమాచారం. ఈ మేరకు సమీకరణాలు జరిపిన అధిష్టానం స్థానిక సంస్థల ప్రజలను మెప్పించి ఒప్పించేందుకు కూడా ప్రయత్నిస్తోంది.



Next Story

Most Viewed