20 ఏళ్ళ ఉత్సవాలకు బ్రేక్… డిసైడ్ చేసిన గులాబీ బాస్

by  |
20 ఏళ్ళ ఉత్సవాలకు బ్రేక్… డిసైడ్ చేసిన గులాబీ బాస్
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్​ఎస్​ ప్లీనరీ వరుసగా మూడో ఏడాది కూడా జరుగనట్టే. 20 ఏండ్ల ఉత్సవాలు నిర్వహించడం లేదంటూ పార్టీ నేతలకు సమాచారమిచ్చారు. కరోనా సెకండ్​వేవ్​ నేపథ్యంలో ప్లీనరీని వాయిదా వేస్తున్నట్లు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్​పార్టీ శ్రేణులకు తెలిపారు. ఈసారి ప్లీనరీకి ఆరు లక్షల మందిని సమీకరించాలని కేసీఆర్​ ఇప్పటికే పార్టీ నేతలకు సూచించారు. దీనిపై జిల్లాల వారీగా పార్టీ నేతలకు కూడా బాధ్యతలిచ్చారు. కానీ కరోనా నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ద్విదశాబ్ది ఉత్సవాలు వాయిదా వేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాధి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది. టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించి ఈ నెల 27 నాటికి 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించాలని భావించారు.

అయితే, ప్రస్తుతం కరోనా తీవ్రత.. మినీ మునిసిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఉత్సవాలను వాయిదా వేశారు. 2001 ఏప్రిల్​ 27న తెలంగాణ సాధన లక్ష్యంగా ఉద్యమపార్టీగా టీఆర్​ఎస్​ ఆవిర్భవించింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత పూర్తి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా టీఆర్​ఎస్​ జెండాతో ఎన్నికల పోటీకి దిగారు. అప్పుడు 54 స్థానాల్లో పోటీ చేస్తే 26 స్థానాల్లో గెలిచారు. ఆ తర్వాత 2008 ఉప ఎన్నికల్లో 16 స్థానాల్లో పోటీకి దిగి ఏడు స్థానాలు, 2009 అంసెబ్లీ ఎన్నికల్లో 45 స్థానాల్లో పోటీ చేసి 10 స్థానాల్లో గెలిచారు. ఈ ఎన్నికల్లో టీఆర్​ఎస్​ అభ్యర్థులు 13 చోట్ల డిపాజిట్లు కోల్పోయారు. ఆ తర్వాత పరిస్థితులు టీఆర్​ఎస్​కు అనుకూలిస్తూ వచ్చాయి. 2010 ఉప ఎన్నికల్లో 11 స్థానాల్లో పోటీ చేస్తే అన్నింటా గెలిచారు. 2011లో ఒక్క స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బంపర్​ మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత 2014లో తెలంగాణ స్వరాష్ట్రంలో 119 సీట్లలో పోటీ చేసిన టీఆర్​ఎస్​ 63 స్థానాలు దక్కించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం 2019 ఎన్నికల్లో 119 స్థానాల్లో పోటీ చేసి 88 స్థానాలను దక్కించుకుంది.

అయితే టీఆర్​ఎస్​ పార్టీ ప్రతిఏటా ఏప్రిల్​ 27న ప్లీనరీని నిర్వహిస్తూ వస్తోంది. కానీ 2019లో పార్లమెంట్​ ఎన్నికల సందర్బంగా నిర్వహించలేదు. ఆ తర్వాత 2020లో కరోనా లాక్​డౌన్​ ఉండగా… ఈ ఏడాది కూడా కరోనా కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రస్తుతానికి ద్వీదశాబ్ధి ఉత్సవాలను నిర్వహించడం లేదంటూ గులాబీ బాస్​… పార్టీ నేతలకు సమాచారమిచ్చారు.


Next Story

Most Viewed